నాగబాబుకు టీడీపీ కౌంటర్.. పిఠాపురంలో జనసేన బలం కేవలం 20 శాతం మాత్రమే


ANDRAPRADESH, KAKINADA, PITAPURAM: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడిన నాటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్‌.వి.ఎస్.ఎన్. వర్మ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. వర్మ త్యాగం వల్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని, అందుకే పిఠాపురం తమ అడ్డా అంటూ జనసేన పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జనసేనకు ధీటుగానే స్థానిక టీడీపీ నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య దూరం మరింత పెంచినట్టు అయింది.


పవన్ కళ్యాణ్ సోదరుడు, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా నాగబాబు పిఠాపురం జనసేన అడ్డ అని వ్యాఖ్యానించడం ఏపీ అంతట పెద్ద దుమారాన్ని రేపింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అభిమానుల కృషి వల్లే తప్ప, ఎవరి అండ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అప్పటి నుంచి టీడీపీ, జనసేన మధ్య పిఠాపురంలో సైలెంట్ వార్ నడుస్తున్నది.ఈ వ్యాఖ్యలపై రెండు పార్టీల అధినాయకత్వాలు స్పందించినప్పటికీ, స్థానికంగా మాత్రం నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

తాజాగా కడపలో నిర్వహించిన మహానాడుకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాల్టీ గురించి అడగగా, అక్కడి నాయకులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక నాయకుడు మాట్లాడుతూ, పిఠాపురం అంతా కూడా టీడీపీనే ఉందని స్పష్టం చేశారు. టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న వర్మ పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ గెలిచారని తెలిపారు.

వర్మ గత 25 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, భారీగా నిధులు కూడా ఖర్చు చేశారని నాయకులు ప్రశంసించారు. పిఠాపురంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలను, కార్యకర్తలను పేరు పెట్టి పలకరించేంత సన్నిహితం ఆయనకు ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో టీడీపీ బలం 80 శాతం ఉంటే, జనసేన బలం కేవలం 20 శాతం మాత్రమేనని తెలియజేశారు. మొత్తానికి మహానాడులో మరొకసారి వర్మ స్టామినా ఏంటో బయటపడిందని అభిమానులు, కార్యకర్తలు తెలుపుతున్నారు. పిఠాపురంలో జనసేన 'అడ్డా' అన్న నినాదానికి టీడీపీ వర్గాలు తమ బలంతోనే గెలుపు సాధ్యమైందని గట్టిగా బదులిస్తున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.