ANDRAPRADESH, KAKINADA, PITAPURAM: పిఠాపురం ఎపుడు చూసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి పిఠాపురం ఎపుడూ ఒక సాధారణ నియోజకవర్గంగా ఉంటూ వచ్చేది తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండే పిఠాపురం అసెంబ్లీ విషయంలో ఒక్కసారిగా పొలిటికల్ హైప్ క్రియేట్ కావడానికి కారణం ఉంది. పవర్ స్టార్ గా వెండితెరను ఏలే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని పెట్టి తనదైన శైలిలో ముందుకు సాగుతూ వచ్చారు.
ఆయన 2024 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ సీటుని ఎంపిక చేసుకున్నారు. పొత్తులలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు ఆ సీటు కేటాయించింది. దాంతో పిఠాపురం ఒక్కసారిగా ఏపీలో అతి ముఖ్యమైన అసెంబ్లీ సీటుగా మారింది. ఇక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దాంతో పిఠాపురం మా అడ్డా అంటోంది జనసేన. ఇటీవల పిఠాపురంలోనే జనసేన ప్లీనరీని నిర్వహించింది.
ఈ ప్లీనరీలో ఎమ్మెల్సీగా కొత్తగా నియమితులైన నాగబాబు పిఠాపురం జనసేన అడ్డా అని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పిఠాపురంలో పవన్ గెలుపుని ఎవరో నిర్ణయించలేదని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు అంతా తలచుకుని పవన్ ని గెలిపించుకున్నారు అని కూడా నాగబాబు వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆనాటి నుంచే టీడీపీ జనసేనల మధ్య పిఠాపురం అడ్డా ఎవరిది అన్న దాని మీద డిబేట్ పొలిటికల్ గా సాగుతూనే ఉంది.
ఇక చూస్తే కనుక కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పిఠాపురం నుంచి వచ్చి పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా వారిని పలకరించినపుడు పిఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారు చెప్పుకొచ్చారు. పిఠాపురం అంతా తెలుగుదేశం మయం అని ఒక కీలక నాయకుడు చెప్పుకొచ్చారు. పిఠాపురం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ పార్టీని పెట్టిన దగ్గర నుంచి పిఠాపురం పసుపు జెండా ఎత్తుతూ వస్తోందని అన్నారు.
ఇక టీడీపీ ఇంచార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ తాను త్యాగం చేసి పొత్తులో పవన్ కి టికెట్ ఇస్తే ఆయనను గెలిపించారు అన్నారు. వర్మ గత పాతికేళ్ళుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వస్తున్నారని చెప్పరు. ఆయన ఈ నేపధ్యంలో ఎంతో డబ్బు కూడా ఖర్చు చేశారు అన్నారు. మొత్తం పిఠాపురంలో ఉన్న ప్రతీ గ్రామంలో కనీసం పాతిక మంది దాకా పార్టీ కార్యకర్తలను పేరు పెట్టి పలకరించేటంత సాన్నిహిత్యం వర్మకు ఉందని అన్నారు.
పార్టీని కార్యకర్తలను వర్మ ఎంతో బాగా చూసుకుంటారని అన్నారు. మొత్తం పిఠాపురంలో టీడీపీ బలం ఎనభై శాతం అయితే జనసేన బలం ఇరవై శాతమే అని తేల్చేశారు. టీడీపీ ఓట్లు నూరు శాతం బదిలీ అయ్యేలా వర్మ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని పవన్ కోసం ఆయన మొత్తం కుటుంబంతో కలసి చేసిన తీవ్రమైన ప్రచారం వల్లనే పవన్ కి ఇంత మెజారిటీ వచ్చిందని అన్నారు.
ఒకవేళ వర్మ కనుక మనస్పూర్తిగా ప్రచారం చేయకపోతే ఫలితం వేరే విధంగా ఉండేదని అన్నారు. అంతే కాదు టీడీపీని కాదని జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనుక పవన్ కి 20 శాతం లోపే ఓట్లు వస్తాయని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ లో అంతా వర్మకే మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మరీ త్యాగం చేయించారని అన్నారు. ఇపుడు ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం మీద చూస్తే పిఠాపురం లో క్షేత్ర స్థాయిలో రియల్ హీరో వర్మ మాత్రమే అని ఆ పార్టీ అంటోంది. తన పాతికేళ్ళ రాజకీయ జీవితంలో వర్మ సాధించుకున్నది పిఠాపురం జనాల అభిమానం అని అంటున్నారు. మరి ఇంతకీ పిఠాపురం ఎవరి అడ్డా అంటే వర్మదే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. జనసేన అడ్డా అని వారు అంటున్నారు. ఈ వివాదానికి ముగింపు ఉంటుందా లేదా అంటే కాలమే చెప్పాల్సి ఉంది అని అంటున్నారు అంతా. ఏది ఏమైనా పిఠాపురం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఇది పిఠాపురంలో రియాలిటీ. పిఠాపురం అంటే వర్మ గారి అడ్డా. వర్మ గారు లేకపోతే పవన్కి 20% ఓటు కూడా వచ్చేది కాదు. తమపై నాగబాబు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు.
ఇది పిఠాపురంలో నిగ్రహించాల్సిన వాస్తవం.
— Tupaki (@tupaki_official) May 28, 2025
పిఠాపురం అంటే వర్మ గారికి ప్రత్యేక స్థానం. వర్మ గారి మద్దతు లేకపోతే పవన్ కళ్యాణ్కు 20 శాతం ఓటు కూడా రావడంలేదు.
నాగబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందనగా, తెలుగు దేశం పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
VC: Rtv#PawanKalyan #Nagababu… pic.twitter.com/KYPtiU7z1N