ఈ పొత్తు ఎన్నాళ్లో.. జ్యోతుల నెహ్రూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


ANDRAPRADESH, KAKINADA: టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కాకినాడ జిల్లా జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. By: BCN TV NEWS ప్ర‌స్తుతం ఉన్న పొత్తు ఎన్నాళ్లు ఉంటుందో..? అని అత్యంత కీల‌క వ్యాఖ్య‌లు సంధించారు. అంతేకాదు.. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత‌.. అనేక పార్టీల‌తో పొత్తు పెట్టుకుంద‌ని.. అనేక సార్లు బ‌య‌ట‌కు కూడా వ‌చ్చింద‌ని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. తాజాగా గురువారం కాకినాడ‌లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులో జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. 

 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. గ‌త కొన్నాళ్లుగా త‌న‌కు ఏ ప‌ద‌వీ ఇవ్వ‌డం లేద‌న్న అక్క‌సుతో ఉన్న జ్యోతుల‌.. గ‌తంలో నిండు స‌భ‌లోనే త‌న‌ను ఉండే మంటే అసెంబ్లీలో ఉంటాన‌ని.. లేక‌పోతే వెళ్లిపోతాన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌కంటే సీనియ‌ర్లు స‌భ‌లో లేనేలేర‌ని కూడా వ్యాఖ్యానించారు. ఇలా.. త‌న‌కు అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఆయ‌న‌.. తాజాగా మినీ మ‌హానాడు వేదిక‌గా కూడా నోరు చేసుకున్నారు. 

ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు ఎవ‌రికి ద‌క్కుతున్నాయో.. అంద‌ర‌కి తెలుసున‌ని వ్యాఖ్యానించారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ నిర్వీర్యం అవుతోంద‌ని అన్నారు. '' జిల్లాలో ఎవ‌రికి ప‌ద‌వులు ఇచ్చారు? ఈవిష‌యం నేను చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌రికీ తెలుసు. కానీ.. ఇక్క‌డ క‌ష్ట‌ప‌డింది మాత్రం టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు. అయితే.. ప‌ద‌వులు మాత్రం వేరేవారికి ఇస్తున్నారు'' అంటూ.. జ‌న‌సేన నేత తుమ్మ‌ల బాబూజీపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల‌న్నీ.. ఇబ్బందుల్లో ప‌డ్డాయ‌ని మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మ‌న పార్టీ(టీడీపీ)కే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఎక్కువ ప‌ద‌వులు రావాల్సి ఉంద‌ని.. కానీ, ఇవ్వ‌డం లేద‌ని.. దీనివ‌ల్ల ఇంట్లో ఆడ‌వాళ్ల‌కు కూడా స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తోంద‌ని మ‌రో తూటా పేల్చారు. ఇదిలావుంటే.. జ్యోతుల వైఖ‌రిపై సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మినీ మ‌హానాడులో పార్టీ అభివృద్ధిపై చ‌ర్చించాల‌ని అంటే..ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డంపై నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.