నాటుసారా నిర్మూలన అందరి బాధ్యత..
సారా తయారీని విడిచిపెట్టిన తయారీదారులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ..
ఏలూరు: నాటుసారా తయారీని విడిచిపెట్టిన తయారీదారులకు ప్రత్యమ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నాటుసారా నిర్మూలనకై ప్రత్యమ్నాయ ఉపాధి కార్యక్రమం కింద డిఆర్డిఏ ద్వారా అర్హులైన 40 లబ్దిదారులకు రూ. 31.40 లక్షలు రుణాలను అందజేసారు. అనంతరం నాటు సారా రహిత జిల్లాగా ఏలూరును నిలుపుతామని, నాటు సారా జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ కార్యక్రమాన్నీ నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నాటుసారా జోలికి వెళ్లకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాటుసారా విడిచిన కుటుంబాలను ఆధుకునేందుకు వివిధ సంక్షేమ శాఖల ద్వారా సర్వే నిర్వహించి వారికి అవసరమైన ఉపాధికార్యక్రమాలు చేపట్టామన్నారు. అతి తక్కువ కాలంలోనే 40 కుటుంబాలకు రూ. 31.40 లక్షలు రుణాలు అందించగలిగామన్నారు.
రుణాలు పొంది తిరిగి నాటాసారా జోలికి వెళ్లితే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మీ కుటుంబాల నుండి ఎక్సైజ్ అదికారులుగా ఉద్యోగాలు పొందే స్ధితికి మీ పిల్లలను తీసుకురావాలన్నారు. ఐఎఎస్, ఐపిఎస్ చేయాలనుకున్నా మా దగ్గరికి మీపిల్లను తీసుకువస్తే వారికి తగిన మార్గదర్శనం అందిస్తామని భరోసా ఇచ్చారు. గౌరవంగా సమాజంలో జీవనం సాగించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ వృత్తిని విడిచిన కుటుంబాల్లో చదువుకున్నవారు బాజ్ మేళాలో ధరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని కలెక్టర్ సూచించారు. నాటాసారా తయారీపై 14405 టోల్ ఫీ నెంబరుకు సమాచారం అందించాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా తయారీకి సంబంధించి 745 కేసులు నమోదు చేసి 754 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ నాటుసారా ఆరోగ్యానికి, సమాజానికి హానికరమన్నారు. నాటుసారా జోలికి వెళ్లకుండా ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో సమాజంలో గౌరవ ప్రధంగా జీవించేందుకు చక్కటి బాటలు వేసుకోవాలన్నారు. పాల వ్యాపారమే కాకుండా మిగిలిన చక్కటి వ్యాపారం కూడా చేపట్టాలని సూచించారు.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ బి. శ్రీలత మాట్లాడుతూ నాటుసారా రహిత గ్రామాల్లో ప్రత్యమ్నాయ ఉపాధి మార్గాలను జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీకి సంబంధించి 132 కుటుంబాలను గుర్తించామని వాటిలో 40 కుటుంబాలకు ఉన్నతి, స్త్రీనిధి, బ్యాంకు రుణాలు కింద రూ. 31.40 లక్షలు అందించడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నవోదయం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో జిల్లా కలెక్టర్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
నాటుసారా విడిచిపట్టి ప్రత్యామ్నాయ ఉపాధి చేపట్టిన పలువురు అభిప్రాయాలు..
చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన బనవాతు రాజకుమారి మాట్లాడుతూ గతంలో నాటుసారా కాసేవాళ్లమని ప్రస్తుతం ఆదారిని విడిచిపెట్టి మంచిమార్గంలో జీవించేందుకు ప్రభుత్వం అందించిన సహాయాన్ని అందిపుచ్చుకున్నామన్నారు. తన భర్త బి.టెక్, తాను బి.ఇ.డి చేశాన్నారు. ప్రస్తుతం పాడిగేదెలు పెంచుకుంటున్నామని, ప్రస్తుతం ఉన్నతి ద్వారా 50 వేలు రూపాయలు రుణం పొందామని తద్వారా పాల వ్యాపారం నిర్వహించుకుంటున్నామన్నారు.
నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన భూక్యా రత్నకుమారి మాట్లాడుతూ నాటుసారా జోలికి వెళ్లకుండా పాలవ్యాపారం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉన్నతి ద్వారా పొందిన రూ. 50 వేలతో ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. వీటితోపాటు తమకు ఉన్న కొన్ని మేకలను పెంచుకుంటామన్నారు.
నూజివీడు మండలం పోలసానిపల్లికి చెందిన ఇంజమల విజయ్ అనే మహిళ మాట్లాడుతూ నవోదయం కింద జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. తాను చిన్న వయస్సులోనే వివాహం చేశారని, తన భర్త డ్రైవింగ్ చేస్తారని చాలీచాలనీ ఆదాయంవున్న తాము పిల్లల చదువుకోసం నాటుసారా తయారీ చేపట్టామన్నారు. అయితే తమ ఇద్దరు పిల్లలు బాగానే చదువుకుంటున్నారన్నారు. ఈలోగా నవోదం ద్వారా కిరాణాషాపు ఏర్పాటుకు రూ. 2 లక్షల రూపాయలు రుణం అందించారని దీనితో కిరాణా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు.
ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంకు చెందిన జి. ధనలక్ష్మి భర్త వెంకట్రావు ఈ కార్యక్రమానికి హాజరై కరోనా సమయంలో తప్పని పరిస్ధితిలో ఆదాయం కోసం నాటుసారా జోలికి వెళ్లి తప్పుచేశామన్నారు. తిరిగి తాము ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయలతో కిరాణా వ్యాపారం చేసుకుని సమాజంలో గౌరవంగా జీవిస్తామన్నారు.
బుట్టాయిగూడెం మండలం కొవ్వాడకు చెంది జోగి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదోతరగతి నుంచే నాటుసారా తయారీ చేపట్టానని, ప్రస్తుతం తమ వయస్సు 50 సంవత్సరాలకు చేరిందన్నారు. గత ఏడాది లోపు నాటాసారా వ్యాపారం చేశానని, అయితే తన పిల్లలు చేయవద్దని తన పిల్లలు మాన్పించారని అప్పటి నుంచి కిళ్లీకొట్టు పెట్టుకున్నానని, ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా పొందిన లక్ష రూపాయలతో కిరాణా వ్యాపారం నిర్వహిస్తానన్నారు.
ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంకు చెందిన మిడతా దుర్గారావు మాట్లాడుతూ కొంతమంది స్నేహితుల దుర్మార్గానికి బలైయి తాను నిర్వహిస్తున్న వ్యాపారాల్లో నష్టాలు సరిచూసానని, కొన్ని రాత్రులు నిద్రలేకుండా తిండి లేకుండా జీవిస్తున్న సమయంలో తన భార్య బలవంతంతో నాటుసారా వ్యాపారం ప్రారంభించానన్నారు. ప్రస్తుతం ఆ మార్గం నుంచి స్త్రీనిధి కింద అందిస్తున్న లక్ష రూపాయలతో పాడి అభివృద్ధి చేసుకుంటానన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య, అసిస్టెంట్ కమీషనర్లు కె.వి.ఎన్. ప్రభుకుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి. పాండురంగారావు, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, పలువురు ఎక్సైజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.