ANDRAPRADESH, VISAKHAPATNAM: వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయి మంత్రిగా కూడా చేసిన అవంతి శ్రీనివాసరావు గత డిసెంబర్ లో వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కూటమి ప్రభుత్వం బాగుందని కితాబు కూడా ఇచ్చారు. దాంతో ఆయన కూటమిలోకి వెళ్తారని ప్రచారం సాగింది.
భీమునిపట్నం నియోజకవర్గానికి చెందిన అవంతికి అక్కడ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నుంచి బ్రేకులు పడ్డాయని అంటున్నారు. అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా అవంతి చేస్తున్న ప్రయత్నాలకు ఇన్నాళ్ళకు ఒక సానుకూల ఫలితం దక్కే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కడం వెనక ఆయన కుమార్తె కార్పోరేటర్ ఒకే ఒక్క ఓటు తులసీదళంగా పనిచేసిందని దాంతో వైసీపీ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ఆ ఒక్క ఓటే సరిపోయిందని అప్పట్లో ప్రచారం సాగింది. ఆ విధంగా టీడీపీ కూటమికి మేయర్ పీఠాన్ని దక్కించడంలో ఎంతో కృషి చేసిన అవంతికి ఇపుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయిట.
ఆయనను టీడీపీలో కాకపోతే జనసేనలో అయినా చేర్చుకోవడానికి తెర వెనక సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. చాలా కాలంగా ఈ మాజీ మంత్రి కూటమిలో చేరేందుకు చూస్తున్నారు. ఇపుడు ఆయనకు పిలుపు వచ్చిందని చెబుతున్నారు. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆయనకు కూటమి కండువా కప్పేందుకు అంతా సిద్ధం చేశారని అంటున్నారు.
ఇదే విధంగా వైసీపీలో సైలెంట్ గా ఉంటూ కూటమి వైపు చూస్తూ అక్కడ పిలుపు రాక వేచి ఉన్న వారిని ఈ తడవ పిలిచేసి మెడలో కండువాలు కప్పేందుకు రంగం సిద్ధం చేసారని చెబుతున్నారు. ఆ లిస్ట్ లో చాలా మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని ఉత్తరాంధ్రా కోస్తా జిల్లాలలతో పాటు రాయలసీమ నుంచి కూడా కీలక నేతల జాబితాను కూటమి పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అంటున్నారు. అవంతితో శ్రీకారం చుట్టి మరింత మందిని కూటమిలో చేర్చుకోవడానికి అంతా రెడీ చేశారని ప్రచారం సాగుతోంది