పిఠాపురంలో ఇసుక దుమారం...రాజకీయ రచ్చేనా ?


ANDRAPRADESH, KAKINADA, PITAPURAM: ఏపీలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎపుడూ మారుమోగుతూనే ఉంటుంది. దానికి కారణం అక్కడ ఉన్నది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి పిఠాపురంలో ఏమి జరిగినా జరగకపోయినా కూడా అది రాజకీయ రచ్చే అవుతుంది. 

ఇదిలా ఉంటే పిఠాపురం రాజకీయం అక్కడ టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ వర్సెస్ జనసేన అన్నట్లుగా చాలా కాలంగా సాగుతోందని ప్రచారంలో ఉన్న సంగతి విధితమే పై స్థాయిలో వర్మకు పవన్ కి ఇతర జనసేన నేతలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేకపోయినా లోకల్ లీడర్స్ తో మాత్రం తమ్ముళ్లకు తగవులు ఒక రేంజిలో ఉన్నాయన్న చర్చ అయితే ఇంటా బయటా ఉంది.


ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పిఠాపురం వర్మ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన చెప్పినది ఏంటి అంటే పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతోందని. దాని వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని. ఇసుక మాఫియా టన్నుల కొద్దీ ఇసుకను అనుమతి లేకుండా చెరువు గర్భాల నుంచి తవ్వేసుకుంటోందని ఆయన ఆరోపించారు. 

ఇక సామాన్యుడికి మాత్రం తట్టెడు ఇసుక దక్కలేని పరిస్థితి ఉందని అన్నారు. ఒక రైతు అవసరం కోసం తట్టెడు ఇసుకను తవ్వుకోవాలని చూస్తే ఆయన మీద కేసులు పోలీసులు పెడుతున్నారని అదే వందల టన్నులు అక్రమంగా ఇసుక మాఫియా తవ్వేస్తూంటే కేసులు ఎందుకు లేవని లాజిక్ తో కూడిన పాయింట్ తో వర్మ గట్టిగానే నిలదీశారు.

ఆయన అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒకే ఒక చెరువుకు పర్మిషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అది కూడా బట్టీలకు మాత్రమే అని అన్నారు. కానీ ప్రతీ రోజూ పిఠాపురంలో లారీల కొద్దీ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అలా రోజుకు 200లకు పైగా లారీలలో వందల టన్నుల ఇసుకను అక్రమంగా తీసుకుని పోతున్నారని అయినా పోలీసులు కేసులు పెట్టకపోవడమేంటి ఆయన ప్రశ్నించారు.

అసలు వారిని పట్టుకుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. పోలీసులు మారాలని గతంలోనే పవన్ కళ్యాణ్ సూచించారని కానీ వారిలో ఎలాంటి మార్పులు రావడం లేదని వర్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ఇసుక మాఫియాను అడ్డుకోవడం లేదు అంటే వారికి రావాల్సింది వచ్చేస్తోంది అని సంచలన వ్యాఖ్యలను వర్మ చేశారు.

మొత్తానికి చూస్తే వర్మ ఇసుక మాఫియా పిఠాపురంలో పెద్ద ఎత్తున సాగుతోందని పేదలకు మాత్రం తట్టెడు ఇసుక దొరకడం లేదని అసలు నిజాలు చెప్పేశారు. పైగా అది పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం దాంతో ఇపుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఏమి జరుగుతుందో అన్న చర్చ అయితే ఉంది. 

పిఠాపురం ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ జమానాలో కూడా ఇసుక మాఫియా దర్జాగా తన హవా చాటుతోంది అంటే దాని మీద విమర్శలు వెల్లువెత్తడం ఖాయమని అంటున్నారు. కూటమికి చెడ్డ పేరు అంటూ వర్మ చేసిన ఈ కామెంట్స్ ఏ పరిణామాలకు దారి తీస్తాయో చూడాల్సి ఉందని అంటున్నారు.