ANDRAPRADESH, ELURU, DENDULURU: అధికారంలో ఉన్నంతకాలం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తానన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం నేను-నా బలగం అంటూ మరొకరికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అదే నాయకుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవటం లేదు. ఇంతకీ…ఎవరా నాయకుడు? ఏంటా నియోజకవర్గం?
పొలిటికల్ హైడ్రామాకు కేరాఫ్ అడ్రస్గా ఉండే దెందులూరు నియోజకవర్గానికి 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు కొఠారు అబ్బయ్య చౌదరి. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు. వైసిపి అధినేతకు సన్నిహితంగా ఉండే అబ్బయ్య చౌదరి 2019ఎన్నికల్లో అప్పటికే టిడిపి తరపున రెండుసార్లు గెలిచిన చింతమనేని ప్రభాకర్పై విజయం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించారాయన.
ఇక అధికారంలో ఉన్నంతకాలం ప్రత్యర్ధులపై ప్రతికారం తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సొంత కోటరికే పరిమితమయ్యారనే ఆరోపణలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. వైసిపి తరపున బలమైన నియోజకవర్గంగా దెందులూరును అబ్బయ్య మార్చేసారని ఆ పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. తీరా ఎన్నికల్లో ఓటమితో వైసిపి వర్గాలు ఒక్కసారిగా అవాక్కయ్యాయి. అప్పటి వరకు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న అబ్బయ్య.. ఓటమి తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ విదేశాల్లోనే మకాం వేసారు.
అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆయన అండచూసుకుని ప్రత్యర్ధుల విషయంలో రెచ్చిపోయిన వైసిపి నాయకులకు ఇపుడు టిడిపి వైపునుంచి రిటర్న్ గిఫ్టులు అందుతూనే ఉన్నాయట. ఐతే నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య అందుబాటులో లేకపోవడంతో దెందులూరు వైసిపి కార్యకర్తలు, నాయకులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్ధంగాక అయోమయానికి గురవుతున్నారని సమాచారం. వైసిపి అడ్డాగా నియోజకవర్గాన్ని మారుస్తానని అప్పట్లో తెగేసి చెప్పిన అబ్బయ్య ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎందుకు స్పందించడంలేదనేది ఆపార్టీ నేతలకు అర్ధంగాని ప్రశ్నగా మారిందట.
ఇక…ఎన్నికలు ముగిసి ఏడాది గడిచింది. నియోజకవర్గంలో వైసిపి నేతలపై లెక్కకుమించిన కేసులు నమోదవుతున్నా..సదరు మాజీ ఎమ్మెల్యే నేతల్ని పట్టించుకోకపోవడానికి కారణాలు ఏంటా అని పదేపదే చర్చించుకుంటున్నారని సమాచారం. అబ్బయ్య చౌదరి వైసిపిలో కొనసాగుతారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. పరిస్థితులు చూస్తే అందుకు అనుకూలంగా లేవనేది వారి చర్చల్లో తెలుస్తోంది. తాజాగా జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలోనూ నాయకులు,నేతల మధ్య ఇదే చర్చకొనసాగినట్టు సమాచారం.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య వైసిపిని వీడితే.. టిడిపిలో చేరతారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయట. ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నాయి వైసిపి వర్గాలు. అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న అబ్బయ్య ఓటమి తర్వాత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసిపి నుంచి టిడిపిలో చేరిన మాజీ మంత్రి ఆళ్ళనాని సహకారం కొంత, సామాజికవర్గ పెద్దల సాయం మరికొంత తీసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. అబ్బయ్య పార్టీని వీడితే దెందులూరు నియోజకవర్గ ఇంఛార్జి పగ్గాలను పెదపాడు మండలంలో కమ్మసామాజిక వర్గానికి చెందిన ఆర్ధికంగా బలంగా ఉన్న మరోనేతకు అప్పగించే అవకాశాలు లేకపోలేదని సమాచారం.
వైసిపిలో అబ్బయ్య కొనసాగుతారా? లేదా? అనే విషయం పక్కనబెడితే.. ఆయన టిడిపి ఎంట్రీపై ఆపార్టీ నేతలు మరోరకంగా చర్చించుకుంటున్నారట. పసుపు పార్టీలో చేరాలంటే ముందు కొల్లేరు ప్రజలకు బకాయిపడిన సొమ్ములు చెల్లించాల్సి ఉంటుందని, గతంలో తమపై పెట్టిన కేసులు, వేధింపులకు సమాదానం చెప్పాలంటున్నారట టిడిపి నేతలు. ఈ విషయంలో ఏం జరగబోతోంది అనేది మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య స్పష్టత ఇస్తే తప్ప పూర్తిక్లారిటీ వచ్చే అవకాశాలు లేవని వైసిపి నాయకులు సైతం భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది.