ANDRAPRADESH, CHITURU, TIRUPATI: సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు అసలు వివరాల్ని వెల్లడించింది. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కీలకంగా భావించే నెయ్యికి సంబంధించిన షాకింగ్ నిజాన్ని సీబీఐ న్యాయవాది సిట్ హైకోర్టులో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని స్పష్టం చేసింది. నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డెయిరీ.. వైష్ణవి డెయిరీ అయినప్పటికీ దాని వెనుక ఉండి కథ నడిపించింది మొత్తం భోలే బాబా డెయిరీగా వెల్లడించారు.
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు అసలు వివరాల్ని వెల్లడించింది. ఆ మాటకు వస్తే భోలే బాబా డెయిరీకి పాలు.. నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులు తమకు చెప్పిన విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. కేవలం పామాయిల్.. రసాయనాలు.. ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డెయిరీ.. వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లుగా తమ విచారణలో తేలినట్లుగా పేర్కొంది.
నాణ్యత సరిగా లేని నెయ్యిని సరఫరా చేసిన నేపథ్యంలో భోలే బాబా డెయిరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో ఏఆర్ డెయిరీ.. వైష్ణవి డెయిరీలను ముందుకు తెచ్చిన భోలే బాబా డెయిరీ.. అసలు నెయ్యి లక్షణాలు లేనివాటిని సరఫరా చేసింది. అంతేకాదు.. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఈ ఏడాది ఏప్రిల్ ఏడున ఢిల్లీ నుంచి తిరుపతి ఎయిర్ పోర్టుకు రాగా.. అతడిపై పిటిషనర్లు.. వారి తరఫు వారు బెదిరించి దాడి చేయటంతో పాటు చెన్నై ఎయిర్ పోర్టుకు బలవంతంగా తీసుకెళ్లి.. ఢిల్లీకి పంపిన వైనాన్ని పేర్కొంది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యిని సరఫరా చేసిన ఉదంతంలో కేసు నమోదు చేయటం.. అందుకు బాధ్యుల్ని అరెస్టు చేయటం తెలిసిందే. వీరికి బెయిల్ మంజూరు చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. తమ క్లయింట్లు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని.. అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. అన్ని ఆధారాలు సిట్ చేతిలో ఉన్న నేపథ్యంలో పిటిషన్లు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని.. ఎలాంటి షరతులైనా విధించి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు లాయర్లు కోర్టును కోరారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నకిలీ నెయ్యితో లక్షలాది మంది అనారోగ్యానికి కారణమైన వారి అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.