షాకింగ్ ట్విస్ట్.. హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్ కేసులో భార్యే హంతకురాలు!


INDIA, CRIME NEWS: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంది. మేఘాలయలో మిస్సైన ఇండోర్ దంపతుల కేసు మిస్టరీ చివరికి వీడింది. హనీమూన్‌కు వెళ్లిన ఈ కొత్త జంట అదృశ్యమైన కేసులో భర్త రాజా రఘువంశీ మృతదేహం కొన్ని రోజుల క్రితం లభ్యం కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మిస్సైన భార్య సోనం ఆచూకీని పోలీసులు గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక పోలీసు దర్యాప్తులో సోనం తన భర్తను చంపడానికి సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించినట్లు వెల్లడైంది. 

 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంది. మే 11న సోనంతో అతనికి వివాహం జరిగింది. మే 20న ఈ కొత్త జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మేఘాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు ఒక టూ-వీలర్‌ను అద్దెకు తీసుకుని, మే 22న మౌలాకియత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ టూ-వీలర్‌ను పార్క్ చేసి, ప్రసిద్ధ ‘లివింగ్ రూట్ బ్రిడ్జ్’ చూడటానికి వెళ్లారు. అప్పటి నుండి వారి ఆచూకీ తెలియలేదు. 

భర్త మృతదేహం లభ్యం – భార్య అరెస్ట్! 
రఘువంశీ అదృశ్యమైన 11 రోజుల తర్వాత, పోలీసులు అతని మృతదేహాన్ని సోహ్రాలోని ఒక జలపాతం దగ్గర లోతైన లోయలో కనుగొన్నారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అదృశ్యమైన అతని భార్య సోనం కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మిస్సైన సోనం, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసుల ముందు లొంగిపోయింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ సోమవారం ప్రకటించారు. ఆమెకు సహాయం చేసిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

భార్యే హంతకురాలు పోలీసుల విచారణలో నిందితులు, రఘువంశీని చంపడానికి అతని భార్య సోనమే తమకు సుపారీ ఇచ్చిందని వెల్లడించారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని, అప్పుడే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా స్పందించారు. కేవలం ఏడు రోజుల్లో కేసును ఛేదించినందుకు రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ హత్య కేసులో ఇంకా ఎక్కువ మంది నిందితులు ఉండవచ్చు అని సీఎం వెల్లడించారు, వారిని అరెస్ట్ చేయడానికి ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ సంఘటన ప్రేమ, పెళ్లి పేరుతో జరిగిన ఒక మోసమా లేదా మరేదైనా కారణం ఉందా అనేది పోలీసులు పూర్తి దర్యాప్తు తర్వాత తేలాల్సి ఉంది.