కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై నేడు అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో బహిరంగ సభ


సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో అమరావతిలో బహిరంగ సభ

రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో సిద్దమైన వేదిక

బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ANDRAPRADESH:ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, గుజరాత్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా నేటికి వాయిదా వేశారు.

సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు రాబోయే నాలుగేళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి గురించి వివరించనున్నారు.

సమాచారం ప్రకారం, ఈ సభలో వివిధ శాఖల పనితీరుపై మంత్రులను ముఖ్యమంత్రి ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబడతారు. మంత్రులు, కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఓడీలు, సెక్రటరీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ సభకు హాజరుకానున్నారు. అమరావతిలో బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.