HYDERABAD:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని అన్నారు.
సచివాలయం నుంచి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. కొత్తగూడెం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మిగిలిన మంత్రులు రేవంత్ తో కలిసి దీనికి హాజరయ్యారు.
భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల పంపిణీపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండాలని అన్నారు. ప్రస్తుత సీజన్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కీలకమైన అయిదు విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి రోజూ వారి కార్యాచరణపై నివేదికలు సమర్పించాలని చెప్పారు.
అత్యవసర పనుల కోసం ప్రతి కలెక్టర్ కు కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని, ప్రస్తుత సీజన్లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పారు. నష్టం జరిగితే ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, సీజన్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వచ్చే రోజుల్లో వర్షాలు కురియనున్న నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొన్నిచోట్ల అంచనాలకు మించిన భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో.. ఈ సీజన్లో వాతావరణ శాఖ అందించే సూచనలను ప్రజలకు చేరే విధంగా కిందిస్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలనిఅన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్నందున, వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
డెంగ్యూతో పాటు సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సర్వసన్నద్ధం గా ఉండాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఐటీడీఏ ఏజెన్సీ ఏరియాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు.
నీటి పారుదల వ్యవహారాల్లో నీటి నిల్వలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ముందుకు సాగాలి. జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలని, కృష్ణా బేసిన్లో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైందని, త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని, ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ చెప్పారు. ప్రతి డీలర్ వద్ద ఎరువులు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయన్నది స్టాక్ వివరాలను తెలియజేస్తూ షాపు ముందు విధిగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రతి షాపు వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని అన్నారు.
రాష్ట్రంలో 20-25 శాతం మేరకు ఎరువులను వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు వాడుతున్నట్టు తేలిందని, ఈ విషయంలో అక్రమ రవాణా జరగకుండా నిఘాను అప్రమత్తం చేయాలని సూచించారు. వాటిని దారి మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని రేవంత్ అన్నారు.
భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి నిల్వలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితులను అధిగమించడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా ఆధ్వరంలోని 150 టీమ్లు ఎప్పటికప్పుడు రంగంలో ఉండాలని రేవంత్ చెప్పారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుని ముందస్తుగా బృందాలను సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఏడు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పాత రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడం చేపట్టామని అన్నారు.
Shakir Babji Shaik
Editor | Amaravathi
