ANDRAPRADESH, GUNTURU, బాపట్ల జిల్లా: మృత్యువులోనూ తోడికోడళ్ల బంధం వీడలేదు. కుమారుడికి అమ్మ చేతిముద్ద తినిపిస్తుండగా అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొని పల్టీకొట్టడంతో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుందామని, హాయిగా ప్రయాణం చేద్దామని అందరూ కలిసి బయలుదేరారు. కారు నడుపుతున్న కుమారుడికి ఆప్యాయంగా తినిపించే చేతిముద్దే ప్రమాదానికి కారణమవుతుందని తనతోపాటు తోడికోడళ్లను బలిగొంటుందని ఆమె ఊహించలేదు. చివరకు అదే జరిగింది. ముగ్గురు కలిసే మృత్యుఒడికి చేరారు. తీర్ధయాత్ర కాస్తా విషాదయాత్రగా మారింది.
దైవదర్శనానికి వెళ్తుండగా: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దైవదర్శనానికి కారులో బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదం జరగడంతో ముగ్గురు తోడికోడళ్లు దుర్మరణం చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫి, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలి గాంధీనగర్కు చెందిన కన్నెగంటి నరసింహారావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు అన్నదమ్ములు. వారి సతీమణులు సూర్యకుమారి, సరస్వతి, ఝాన్సీరాణి. వీరంతా ఉమ్మడి కుటుంబాలు. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో అన్నదమ్ములు వేర్వేరు సమయాల్లో మృతి చెందారు. అనంతరం పిల్లలతో కలిసి వేర్వేరు ఇళ్లలో ఉంటున్నప్పటికీ తోడికోడళ్లు అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
కుటుంబ వేడుకలు, దైవదర్శనాలు వంటి వాటికి అందరూ మాట్లాడుకుని కలిసి వెళుతుంటారు. ఈ క్రమంలో తమిళనాడులోని అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకుని గురువారం తెనాలి నుంచి బయలుదేరారు. కన్నెగంటి ఝాన్సీ రాణి (60) కారులో ముందు కూర్చోగా ఆమె కుమారుడు నాగార్జున కారు నడుపుతున్నాడు. వెనక సీట్లో కన్నెగంటి సూర్యకుమారి (62), కన్నెగంటి సరస్వతి (65)తో పాటు వారి ఆడపడుచు క్రిష్టంశెట్టి పార్వతి ఉన్నారు.
కన్నీటిపర్యంతమైన కుటుంబసభ్యులు:
ఈ క్రమంలో నాగార్జునకు అతని తల్లి అల్పాహారం తినిపిస్తుండగా కారు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగంలోని అద్దం పగిలి రోడ్డుపై పడటంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన సూర్యకుమారి, సరస్వతి ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నాగార్జున, పార్వతి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్సై రఫీ రూరల్ సిఐ మల్లిఖార్జునరావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కలిసికట్టుగా అన్యోన్యంగా ఉండే తోడికోడళ్లు మృత్యు ఒడికి ఒకేసారి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.