ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 24: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలతో పాటు మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి త్రైమాసిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా గా విజయవాడ గ్రామీణం, గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు.
అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ త్రైమాసిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించినట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఎదుపాటి రామయ్య (తెలుగుదేశం), వై.ఆంజనేయ రెడ్డి (వై.ఎస్.ఆర్.సి.పి), బొంతు కృష్ణారెడ్డి (బీజేపీ), బొర్రా కిరణ్ (కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.
