వెంటాడుతున్న ఏబీవీ.. నెక్ట్స్ కెలుకుడు వైజాగులోనేనా?


ANDRAPRADESH: వేట.. ఏపీలో ఇప్పుడు వేట కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు ప్రభుత్వ అనుకూల వర్గాలు కొనసాగిస్తున్న వేట రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇందులో పోలీసు అధికారులు, మాజీ పోలీసు అధికారుల పాత్ర మరింత చర్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్సార్ ఆంజనేయులును తాజాగా అరెస్టు చేసి రిమాండుకు పంపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, ఆ పార్టీ నేతలను పీఎస్సార్ ఆంజనేయులు టార్గెట్ చేసేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరరావు కూడా వేట మొదలుపెట్టారు. ప్రభుత్వం ఒకవైపు కేసులు పెడుతూ సర్వీసులో ఉన్నవారిని ముప్ప తిప్పలు పెడుతుండగా, అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్ టార్గెట్ గా ఏబీవీ కదులుతుండటం చర్చనీయాంశమవుతోంది. 


చంద్రబాబు 2014-19 మధ్య అధికారంలో ఉండగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తమను ఇబ్బంది పెట్టారనే కారణంతో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఐదేళ్లలో రెండు సార్లు సస్పెండ్ చేసి, ఒక్క రోజు కూడా యూనిఫాం వేసుకోనీకుండా వేధించారని ఏబీవీ ఆరోపిస్తున్నారు. తన సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లి పోస్టింగు తెచ్చుకున్నారు. ఇక ఆయన రిటైర్ అయ్యాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 

ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించడమే కాకుండా అన్నిరకాల ఆర్థిక ప్రయోజనాలను కల్పించింది. అంతేకాకుండా పోలీసు హౌసింగు బోర్డు చైర్మనుగా ఏబీవీని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. అయితే ఏబీవీ మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెటుగా పనిచేయడానికే మొగ్గుచూపుతూ, జగన్ బాధితులతో న్యాయపోరాటానికి మార్గదర్శకత్వం వహిస్తూ సరికొత్త చర్చకు కేంద్రంగా మారుతున్నారు. 

వైసీపీ హయాంలో తనలాంటి బాధితులను ఆదుకోవడమే ఏబీవీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పరామర్శించిన ఏబీవీ.. ఆ కేసులో జగన్ సాక్ష్యం చెప్పేలా న్యాయపోరాటం కొనసాగించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. నిందితుడు చేసిన నేరానికి మించిన శిక్ష అనుభవించారని ఏబీవీ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది. 

ఇక ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఏబీవీ పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏబీవీ నెక్ట్స్ ఎవరిని కలుస్తారు? ఏ విషయాన్ని మళ్లీ తెరపైకి తెస్తారనేది చర్చనీయాంశమవుతోంది. 

వైసీపీ హయాంలో పలు కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందులో కోడికత్తి కేసు జగన్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాన కారణమైంది. అదే సమయంలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్ కేసు, దళిత యువకుల శిరోముండనం, బాపట్లలో బాలుడి హత్య, అప్పటి ఎంపీ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు వంటివి అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇలాంటి కేసుల్లో బాధితుల తరఫున పోరాటం చేస్తానంటున్న ఏబీవి కోడికత్తి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిసి వారికి అండగా ఉంటానని చెప్పారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు కొత్తగా విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఈ నేపథ్యంలో ఏబీవీ నెక్ట్స్ ఎవరిని కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన నెక్ట్స్ విశాఖ చేరుకుంటారని, అక్కడ డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ కేసును మళ్లీ తెరపైకి తేవాలని ఏబీవీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఏబీవీ అడుగులు ఆసక్తి పుట్టిస్తున్నాయి.