అల్లు అర్జున్ తన కృతజ్ఞతను వ్యక్తం
గద్దర్ అవార్డులపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
అవార్డు అల్లు అర్జున్కు లభించడం ఆసక్తికరం
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ ఎన్టీఆర్ అభినందనలు
TELANGANA: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డులపై టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, 'పుష్ప 2' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారానికి ఎంపికయ్యారు అల్లు అర్జున్.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ఒక వివాదం నేపథ్యంలో, ఈ అవార్డు అల్లు అర్జున్కు లభించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ బన్నీపై ఎలాంటి పగ పెట్టుకోలేదని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఈ పురస్కారం దక్కిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆ వివాదం ముగిసినట్లేనని కూడా పలువురు పేర్కొంటున్నారు. 'పుష్ప' చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ, ఇప్పుడు 'పుష్ప'-2తో గద్దర్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ అవార్డును అందుకున్న తర్వాత అల్లు అర్జున్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ సైతం గద్దర్ అవార్డులపై స్పందించారు. ఆయనకు నేరుగా గద్దర్ అవార్డు దక్కనప్పటికీ, తన సినిమా దేవరకు ఓ అవార్డు దక్కింది. దేవర మూవీకి గాను గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కిన నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. దీంతో పాటు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు.
గద్దర్ అవార్డుల ప్రకటించడంతో ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ తన అభినందనలు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులు ఇవ్వడం హర్షణీయమని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని జ్యూరీ సభ్యులను కోరారు. గద్దర్ వంటి ప్రజా గాయకుడి పేరిట అవార్డులు ఇవ్వడం తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆశిస్తున్నారు.