TELANGANA: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. "బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.. పార్టీలో లీకువీరులు చెప్పమంటే గ్రీకువీరుల్లాగా ఫోజులు కొడుతున్నారు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల సారాంశం కేటీఆర్ వైపే వేలెత్తి చూపుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- కేటీఆర్ Vs కేసీఆర్: కవిత వ్యాఖ్యల అంతరార్థం
ఒక నాయకుడికి నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలంతా వెళ్లి సంఘీభావం తెలుపుతారని, కానీ కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు వెళ్లరని కవిత ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పుడు ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అయితే, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కు "నో ఎంట్రీ" బోర్డు ఉండటం వల్లే ఎమ్మెల్యేలు ఆయన్ను కలిసేందుకు సిద్ధపడలేదనే విషయం కవితకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం కేటీఆర్తో "తాడోపేడో తేల్చుకునేందుకు" సిద్ధపడినట్లేనని స్పష్టమవుతోంది.
-సోషల్ మీడియా పోస్టులు, పెయిడ్ ఛానెళ్లపై కవిత ఆగ్రహం
"సోషల్ మీడియాలో ఇంటి ఆడపడచు మీద చిల్లర పోస్టింగ్ లు చేయిస్తున్నారు" అని, అలాగే "పెయిడ్ ఛానెల్స్ లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు" అని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
-కాంగ్రెస్ వాదనకు బలం చేకూర్చిన కవిత వ్యాఖ్యలు
మరోవైపు, బీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న వాదనకు కవిత వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆలస్యం చేయకుండా కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె విషయంలో వేచిచూసే ధోరణితో ఉంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.
- కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండగానే నోటీసులు?
ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటంతో, ఇదే కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సరైన సమయమని అధిష్టానం భావిస్తున్నట్లు వినికిడి. ఆయన వచ్చాక నోటీసులు ఇస్తే మొత్తం వివాదం కేటీఆర్కు అంటుకునే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏ క్షణమైనా కవితకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.