ANDRAPRADESH, EAST GODAWARI: పర్యాటకానికి ముఖద్వారంగా ఉన్న చారిత్రక నగరం రాజమహేంద్రవరం. అయితే ఇక్కడ 2027 జూలైలో జరగబోయే గోదావరి పుష్కరాల సమయానికి అత్యంత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకుల్ని ఆకర్షించేలా జిల్లా యంత్రాంగం అడగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ చొరవ, ఎంపీ పురందేశ్వరి సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్కు సిస్కా నిధులు సుమారు రూ.94 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
వీటితో పుష్కరఘాట్, హేవలాక్ బ్రిడ్జ్, కడియపులంక, నిడదవోలులోని కోటసత్తెమ్మతల్లి ఆలయ అభివృద్ధితోపాటు అక్కడి కెనాల్లో అందాలు చేకూరనున్నాయి. మొదటి విడతగా నగరంలో పుష్కరఘాట్ అభివృద్ధికి టెండర్లు ఖరారవడంతో జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుడతామని మంత్రి దుర్గేశ్ ఇటీవల ప్రకటించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు: పుష్కర ఘాట్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సిస్కాలో ఘాట్ పునరుద్ధరణకు రూ.26.68 కోట్లు కేటాయించగా రూ.24.79 కోట్లకు టెండరు ఖరారైనట్లు అధికారులు చెప్తున్నారు. కన్సల్టెన్సీ ప్రతినిధులు సిద్ధం చేసిన ఆకృతులను ప్రభుత్వం ఆమోదించడంతో సుమారు 270 మీటర్ల పొడవున్న ఘాట్ రూపురేఖలు మారనున్నాయి. అక్కడికి వచ్చేవారికి ఆహ్లాదం, ఆనందం పంచేలా పనులు చేపట్టనున్నారు. అలాగే ఇక్కడ మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
ఎలా తీర్చిదిద్దుతారంటే: ఇప్పటివరకు ఉన్న పుష్కరాలరేవు రూపురేఖలు మార్చనున్నారు. ఘాట్లో ఉన్న గోదావరి మాత, శివపార్వతి, వినాయక, కార్తికేయ ఇతర చిన్న ఆలయాలు పురాతన వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తారు. గోదావరి హారతితో పాటు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలకు వీలుగా మండపాలు, భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఘాట్ పెవిలియన్ను సుందరంగా తీర్చిదిద్దడం మెట్లను పటిష్టం వాటికి చేసి ఉత్తరాదిలో ఎక్కువగా వినియోగించే పింక్ సాండ్ స్టోన్ అమర్చుతారు.
ఓం ఆకారం, నక్షత్ర స్తంభాలు, మ్యూజికల్ టవర్, వ్యూపాయింట్ అందుబాటులోకి వస్తాయి. పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ మొక్కల ఏర్పాటుకు ప్లాంటర్ బాక్స్లు, ఘాట్ పొడవునా నీటిలో 4 ప్రాంతాల్లో రెండేసి ఏనుగుల బొమ్మలు (మొత్తం 8) నీటిని చల్లేలా తీర్చిదిద్దుతారు. వీటితోపాటు ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు వస్తాయి.