ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం - ఆవుపై దాడి


ANDRAPRADESH, PRAKASHAM: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారం సమీప ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాపినేనిపల్లి అటవీ ప్రాంత సమీపంలో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నారాయణపల్లె గ్రామానికి చెందిన ఫణి కుమార్ అనే రైతు మేత కోసం తన అవును సమీపంలోని పాపినేనిపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కొద్దిసేపటికి పెద్దపులి ఆవుపై దాడి చేసి చంపేసింది.


ఆవును పులి చంపిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పెద్దపులి సంచారంపై నిఘా పెట్టారు. పులి కదలికలను ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నట్లుగా వారు తెలిపారు. కాపర్లు మేత కోసం తమ పశువులను అడవిలోకి తీసుకెళ్లవద్దని చెప్పారు. అలాగే ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.