హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్-2 గంటల సమయం ఆదా /


హైదరాబాద్-విశాఖపట్నం మధ్య రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రెండు నగరాల మధ్య ఉన్న పలు నగరాలు, పట్టణాలకు కూడా వాహనాల రద్దీ ఎక్కువే. దీంతో సహజంగానే ప్రయాణ సమయం కూడా ఎక్కువే ఉంటోంది. ఎంత వేగంగా వెళ్లినా కనీసం 10 గంటలు తప్పనిసరి. అయితే దీన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా ఓ కీలక రహదారి అభివృద్ధి చేస్తున్నారు. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడం మాత్రమే కాదు టోల్ ఫీజు పరంగానూ ప్రయాణికులకు ప్రయోజనం కలగబోతోంది.

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రస్తుతం విజయవాడ మీదుగా వెళ్లక తప్పని పరిస్దితి. విజయవాడ వరకూ వచ్చాక చెన్నై-కోల్ కతా హైవే మీదుగా ఏలూరు దాటాక మధ్యలో నల్లజర్ల, దేవరపల్లి హైవే ఉన్నా అది తిరిగి రాజమండ్రి వద్దే ముగిసిపోతోంది. దీంతో ప్రయాణికులు తిరిగి చెన్నై-కోల్ కతా హైవే పైకి వచ్చి విశాఖ వెళ్లక తప్పని పరిస్దితి. దీంతో హైదరాబాద్-విశాఖ ప్రయాణాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం-దేవరపల్లి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే తెరపైకి వచ్చింది. ఇప్పటికే దీని నిర్మాణం కొనసాగుతోంది.

మరో ఆరు నెలల్లో ఖమ్మం-దేవరపల్లి మధ్య కీలకమైన గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం మీదుగా దేవరపల్లి, విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఈ హైవే నిర్మాణం వల్ల హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణికులకు రెండు గంటల ప్రయాణ సమయం కూడా తగ్గబోతోంది. అంతే కాదు టోల్ గేట్ల విషయంలోనూ కీలక మార్పులు రాబోతున్నాయి.

162 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేపై 100 కిలోమీర్ల వేగంతో కార్లు, బస్సులు, లారీలు మాత్రమే వెళ్లేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనిపైకి బైక్ లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా అనుమతించరు. అలాగే ఈ హైవేపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో కేవలం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇస్తున్నారు. ఇక్కడే టోల్ వసూలు చేస్తారు. మధ్యలో రోడ్డుపై టోల్ గేట్ ఉండదు. దీని వల్ల వాహనాలు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు చెల్లించే వెసులుబాటు కూడా వస్తుంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now