కేటీఆరే టార్గెట్‌గా క‌విత కొత్త రాజ‌కీయం చూశారా...?


TELANGANA: బీఆర్ఎస్‌లో క‌విత లేఖాస్త్రం త‌ర్వాత రాజ‌కీయం రోజు రోజుకు రంగులు మారుతోంది. ఈ క్ర‌మంలోనే త‌మ నాన్న అయిన మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత ఫైర్ అయ్యారు. జూన్ 5న కేసీఆర్ క‌మిష‌న్ ముందు హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే నాలుగో తేదీన రాష్ట్రం వ్యాప్తంగా భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని క‌విత నిర్ణ‌యించారు. ఈ నిర‌స‌న‌లు ఏవీ కూడా బీఆర్ఎస్ త‌ర‌పున ఆమె పిలుపు ఇవ్వ‌లేదు. త‌న తెలంగాణ జాగృతి త‌ర‌పున మాత్ర‌మే ఆమె నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇచ్చారు. ఆమె ఎక్క‌డికి వెళ్లినా బీఆర్ఎస్ నేత‌లు స్వాగ‌తించ‌డం లేదు.. క‌నీసం ఆమెను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసేందుకు కూడా రావ‌డం లేదు. పూర్తిగా ఆమె త‌న సొంత కేడ‌ర్‌, అనుచ‌రుల‌తోనే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.


ఈ క్ర‌మంలోనే కేటీఆర్‌ను ఆమె ఇప్ప‌టికే ప‌లు ర‌కాలుగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే కేటీఆర్ సింపుల్‌గా ఓ ట్వీట్ వేసి స‌ర్దుకున్నార‌ని.. అదే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వ‌స్తే మాత్రం ధ‌ర్నాల‌కు పిలుపు ఇచ్చార‌ని క‌విత రెండు రోజుల క్రింద‌టే కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కామెంట్‌తోనే ఆమె కేటీఆర్‌ను ఎలా టార్గెట్ చేశారో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. ఏదేమైనా క‌విత పార్టీ స్టాండ్ లేకుండా చేప‌డుతోన్న‌ నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆమెకు మంచి మైలేజ్ ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది. కేసీఆర్‌కు వ‌చ్చిన కాళేశ్వ‌రం నోటీసుల గురించి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు.

ఇప్పుడు క‌విత ఏకంగా నిర‌స‌న‌ల దాకా వెళుతోందంటే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుల‌కు ప‌ట్ట‌దా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీద‌కు వ‌స్తాయి. తండ్రి కేసీఆర్‌పై క‌విత‌కు మాత్ర‌మే ఇంత ప్రేమ ఉన్న‌దా ? అన్న కొత్త చ‌ర్చ‌ల‌కు కూడా ఆమె నిర‌స‌న‌లు తావిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఆమె నోటీసుల అంశాన్ని త‌నకు పూర్తి అనుకూలంగా మార్చుకోవ‌డంతో పాటు త‌న సోద‌రుడు కేటీఆర్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాల‌కు కూడా తెర‌లేపుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలే అనుకుంటున్నాయి.