
ANDRAPRADESH, ANANTAPURAM: టీడీపీలో అంతర్గత విభేదాలు శ్రుతి మించుతున్నాయి. పరస్పరం విభేదిస్తున్న నేతలు ప్రత్యర్థులను హతమార్చాలనే నిర్ణయానికి వస్తున్నారనే సమాచారం ఆందోళనకరంగా మారింది.
టీడీపీకి కంచుకోట వంటి అనంతపురం జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలతో ఒకరిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అవడంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి తప్పినట్లైంది. ఇప్పటికే ఒంగోలు, మాచర్లలో సొంత పార్టీ వారే నేతలను హతమార్చడంతో అనంతపురం ఘటనపై ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం వెంటనే అలర్ట్ అయినట్లు చెబుతున్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు సొంత పార్టీకి చెందిన సుధాకర్ నాయుడిని హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. దందాలు, దౌర్జన్యాలపై ఎమ్మెల్యే అనుచరుల మీద ఫిర్యాదులు వస్తుండటతో అనంత ఎస్పీ జగదీష్ నిఘా పెట్టినట్లు చెబుతున్నారు.
ఈ నిఘాలో సుధాకర్ నాయుడు హత్యకు కొందరు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఎస్పీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులతో సుధాకర్ నాయుడికి పొసగడం లేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ విజయం కోసం సుధాకర్ నాయుడు పనిచేసినట్లు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభేదాలు మొదలయ్యయని అంటున్నారు. దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలని పార్టీ అనంతపురం పరిశీలకుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రకు అప్పగించింది. రెండు వర్గాలతో చర్చించి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు.