👉 తాజా వార్తలు:
INDIA, SPORTS NEWS: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (IPL 2025 Champion RCB) సాధించేసింది. 18 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోన్న కలను సాకారం చేసుకుంది. గతంలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరినా అందని ఐపీఎల్ ట్రోఫీని.. నాలుగో ప్రయత్నంలో సాధించేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ (PBKS)పై 6 పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ.. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పటిధార్ జట్టు అభిమానుల్లో తన స్థానాన్ని పదిలిం చేసుకున్నాడు.
ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ లోనూ కింగే అని నిరూపించుకునన్నాడు. మొన్నటి వరకు తన కెరీర్లో వెలతిగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసింది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. జాష్ ఇంగ్లీష్ (23 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్సర్లు) మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు సాధించారు.
తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ బౌలర్లు అద్భుతం చేశారనే అనిపించింది. ఎందుకంటే మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్ రిపోర్ట్ లో సులభంగా 220 పరుగులు చేయొచ్చని క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. దాంతో ఆర్సీబీ 190 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఆర్సీబీ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. విధ్వంసక ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్న ప్రబ్ సిమ్రన్ సింగ్ (26), ప్రియాన్ష్ ఆర్య (24)లను అవుట్ చేశారు. డేంజరస్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (1)ను తొందరగా పెవిలియన్ కు చేర్చారు. జాష్ ఇంగ్లీస్, శశాంక్ సింగ్ లు పోరాడినా పంజాబ్ కింగ్స్ కు అది సరిపోలేదు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రజత్ పటిదార్ (26), లివింగ్ స్టోన్ (25), జితేశ్ శర్మ (24) ఫర్వాలేదనిపించారు. చివర్లో రొమారియో షెపర్డ్ (17) ధాటిగా ఆడటంతో పంజాబ్ ముందు ఆర్సీబీ పోరాడే స్కోరును ఉంచగలిగింది. కైల్ జెమీసన్, అర్ష్ దీప్ సింగ్లకు చెరో 3 వికెట్లు దక్కాయి.