ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ అంటేనే చైతన్యవంతమైన తీర్పు అని చెబుతారు. ఒకసారి నెగ్గిన పార్టీని మరోసారి నిర్దాక్షిణ్యంగా దించేస్తారు. ఇదీ రాజకీయ లెక్క. ఉమ్మడి ఏపీలో కూడా ఒకసారి టీడీపీకి ఒకసారి కాంగ్రెస్ కి చాన్స్ ఇస్తూ పోయారు. మధ్యలో వైఎస్సార్ రెండు సార్లు సీఎం అయ్యారు అంటే తెలంగాణా ఓట్లూ సీట్లూ ఎక్కువ రాబట్టే అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2009లో కూడా ఏపీలో ప్రజారాజ్యానికి చోటు ఇచ్చి తమదైన మార్క్ తో మాపు చూపించారు. ఇక 2014లో చంద్రబాబుకు అధికారం ఇస్తూనే పక్కలో బల్లెంలా జగన్ కి కూడా ఉంచారు. వైసీపీకి సైతం 67 సీట్లు ఇచ్చారు. అలాగే 2019లో వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ఆ పార్టీకే షాక్ ఇస్తే 2024లో కూటమికి 164 సీట్లు ఇచ్చి వారిని సైతం గుక్క తిప్పుకోకుండా చేశారు.
ఇలా ఏపీ జనాలు ఎప్పటికపుడు విలక్షణమైన తీర్పు ఇస్తూ పోతున్నారు. ఏపీలో అందుకే అయిదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతూంటాయి. ఇక 2024లో బంపర్ మెజారిటీతో కూటమికి అధికారాన్ని అప్పగించిన జనాలు ఇపుడు మళ్ళీ జగన్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. తాజాగా జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళకు వెళ్తే జన సందోహం కనిపించింది. అంతే కాదు కేవలం రెండు కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలకు పైగా జగన్ కి సమయం పట్టింది అంటే జన సమ్మర్ధం ఎలా ఉందో అని అంటున్నారు జగన్ కోసం జనాలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వైసీపీ శ్రేణులు హుషారు చేస్తున్నాయి.
దీని కంటే వారం ముందు ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ వస్తే వేలాదిగా జనాలు తరలి వచ్చారు. ఆ మాటకు వస్తే జగన్ ఇటీవల తెనాలి వెళ్ళినపుడు పెద్ద ఎత్తున జనం కనిపించారు. దీంతో అసలు ఏపీలో ఏమి జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. నిజానికి చూస్తే ఏపీలో కూటమి బలంగా ఉంది. అంతే కాదు ఏపీలో కూటమి విజయం మామూలుది కాదు. మొత్తం సీట్లలో 95 శాతం ఆ పార్టీవే. మొత్తం ఓట్లలో అరవై శాతం కూటమివే. మరి ఇంతలా దిగ్విజ్యం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఏడాదిలో తాము చేయాల్సిన పనులు చేస్తోంది. సంక్షేమ పధకాలను అమలు చేతోంది. ఇంటీవలనే తల్లికి వందనం రిలీజ్ చేసి లక్షలాది మంది తల్లుల ఖాతాలలో నగదు వేసింది.
ఈ నేపథ్యంలో మరిన్ని పధకాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఏడాది కాలంలో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం అను నిత్యం ప్రజలలో ఉంటున్నారు. మరి ఇంతలా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువగా ఉన్నా కూడా జగన్ కి ఎందుకు జనాలు పోటెత్తుతున్నారు అన్న చర్చ సాగుతోంది. కేవలం ఏడాదికే కూటమి పట్ల వ్యతిరేకత వచ్చిందా అంటే అది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ఇంకా నాలుగేళ్ల పాటు కూటమి చేతిలో అధికారం ఉంది. అంటే కూటమితో ప్రజలకు పని చాలానే ఉంది. అందువల్ల ప్రజలు ఏమీ తొందరపడరు. కానీ జగన్ కి ఎందుకు జేజేలు అందిస్తున్నారు అన్నదే చర్చగా ఉంది.
అయితే ఏపీలో జనం మాత్రం కూటమికి ఆల్టర్నేషన్ గా వైసీపీని ఎంచుకున్నారు అని అర్ధం అవుతోంది. కూటమి బాగా పాలిస్తే ఓకే కానీ లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని చెప్పేందుకు కూడా ఈ విధంగా జనాలు వైసీపీకి వస్తున్నారు అని భావించవచ్చు అని అంటున్నారు. మరో విశ్లేషణ ఏమిటి అంటే కూటమి పాలనలో పధకాలు వస్తున్నాయి. అయితే ఇంతకు మించి వైసీపీ ఇస్తే రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ వైపు కూడా జనాలు మొగ్గు చూపే చాన్స్ ఉందని అంటున్నారు అంతే కాదు ఏ ఒక్క పార్టీకి అధికారాన్ని కంటిన్యూగా ఇవ్వకుండా ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి ఇవ్వడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. అంటే తమిళనాడు తీరు అన్న మాట. మొత్తానికి ఏపీ జనాల ఆలోచనలు వారి సంతృప్త స్థాయిలు తలపండిన ఏ రాజకీయ పార్టీకి అసలు ఏ మాత్రం అర్ధం కానే కావని అంటున్నారు.