ANDRAPRADESH: ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో , ప్రజలకు మన అవసరం వుండదులే అని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోవడం గురించి గతంలో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆయన పరుగుపరుగునా శ్రీకాళహస్తికి వెళ్లి, అబ్బే నేను ఎక్కడికీ వెళ్లలేదని, వైసీపీ శ్రేణులకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు.
పారిపోయాడని అనుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, తాజా తన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డితో పాటు పోలీసుల్ని గట్టిగా ప్రశ్నిస్తుండడం విశేషం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి సతీమణి కారు డ్రైవర్ …కానిస్టేబుల్ అన్వర్బాషాపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అబ్బే అలాంటిదేమీ లేదని పోలీస్ అధికారులు బుకాయించారు. కానీ కానిస్టేబుల్ గాయాలుపాలు కావడం, మరోవైపు బొజ్జల నుంచి ఎలాంటి ఖండనా లేకపోవడంతో నిజమే అని జనం అనుకునే పరిస్థితి.
ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ప్రజాస్వామ్య దేశంలోనే బతుకుతున్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? అని బియ్యపు మధుసూదన్రెడ్డి నిలదీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించుకుని కొట్టడమేంటని బొజ్జలను ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ దగ్గరి నుంచి కానిస్టేబుల్ను తీసుకెళ్లి, ఎమ్మెల్యే ముందు నిలబెట్టి కొట్టించడం చూసి… పోలీస్శాఖకు ఎలాంటి దుస్థితి ఏర్పడిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
మరోవైపు డీఎస్పీ అలాంటివేమీ జరగలేదని బుకాయించడం, ఎస్పీ కార్యాలయం మాత్రం ఘటన వాస్తవమే అని, కానిస్టేబుల్తో క్షమాపణ చెప్పించలేదని ప్రకటించిందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనిపై డీఎస్పీ సంజాయిషీ ఇవ్వాలని కోరారు. తాను కానిస్టేబుల్ కుమారుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్కు జరిగిన అన్యాయంపై ఏమంటారని ఆయన నిలదీశారు.