ANDRAPRADESH, KAKINADA, PITAPURAM: ఎక్కువ నీతులు మాట్లాడుతూ, ఆచరణలో తుస్సుమనిపిస్తే, పౌర సమాజం నిలదీతకు గురి కావాల్సి వుంటుంది. అందుకే నేల విడిచి సాము చేయవద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రతిపక్ష నేతగా అబ్బో భారీ డైలాగ్లు కొట్టారు. అధికారంలో తాను భాగస్వామి అయితే, రామరాజ్యాన్ని స్థాపిస్తామన్నంతగా పోజు కొట్టారు. తీరా ఆచరణకు వచ్చే సరికి, అందుకు విరుద్ధమైన పాలన సాగుతోందన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దందా ఏ రేంజ్లో సాగుతున్నదో, ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తనదైన రీతిలో ఆరోపణలు గుప్పించారు. తద్వారా పవన్కల్యాణ్కు చురకలు అంటించారన్న చర్చకు తెరలేచింది.
మల్లివారితోటలో అక్రమంగా ఇసుక తరలించడాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోందని వ్యంగ్య కామెంట్స్ చేశారు. పిఠాపురం పోలీసులకు ప్రత్యేక గ్లాస్లు ఇవ్వాలని ఆయన దెప్పి పొడిచారు. ప్రతిరోజూ రాత్రి 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఆయన ఆరోపించారు. అక్రమార్కులతో పోలీసులు కుమ్మక్కు అయ్యినట్టున్నారని ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు.
ఇరవై రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా, వాళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. మామూళ్ల మత్తులో పడి, ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. పిఠాపురంలో జనసేనదే పెత్తనం. ఇక్కడ టీడీపీ ప్రతిపక్షం కంటే అధ్వాన పరిస్థితిలో వుంది. పిఠాపురంలో టీడీపీ ఇన్చార్జ్, కార్యకర్తలంతా తీవ్రంగా రగిలిపోతున్నారు.
టీడీపీ అంటే చాలు, ఏ ఒక్క అధికారి పలికే పరిస్థితి పిఠాపురంలో లేదు. ఇసుక, గ్రావెట్, మట్టి… ఇలా ఒక్కటేమిటి? అన్నింటిపై జనసేన నాయకులదే పెత్తనం. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నయా పైసా కూడా లాభం లేదు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని వర్మ పరిశీలించి, పోలీసులపై విమర్శలు గుప్పించడం ద్వారా, వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. తద్వారా జనసేన నాయకుల ఆదాయ వనరుల్ని ఆయన అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఇదే సందర్భంలో సొంత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా, కళ్లు మూసుకున్నావా? అని పవన్ను వర్మ ప్రశ్నిస్తున్నట్టుగా వుందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.