44వ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
రాంచీలో స్నేహితుల మధ్య అత్యంత నిరాడంబరంగా వేడుక
వైరల్ అయిన ధోనీ కేక్ కటింగ్ సింపుల్ వీడియో
విజయవాడలో ఆకాశమంత కటౌట్ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సోమవారం తన 44వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సొంతూరైన రాంచీలో అత్యంత నిరాడంబరంగా వేడుక చేసుకున్నారు. కేవలం కొద్దిమంది స్నేహితుల మధ్య, స్లీవ్లెస్ టీషర్ట్తో మామూలుగా కనిపిస్తూ కేక్ కట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడంబరాలకు దూరంగా ఉండే ధోనీ సింప్లిసిటీకి ఈ వీడియో అద్దం పడుతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ఆయన అభిమానుల కోణం పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడలో ఫ్యాన్స్ తమ అభిమానాన్ని భారీ స్థాయిలో చాటుకున్నారు. ధోనీ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జెండాలు చేతబూని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుతో ధోనీకి ఉన్న విడదీయరాని బంధానికి, దక్షిణాదిలో ఆయనకున్న క్రేజ్కు ఈ వేడుకలే నిదర్శనం.
2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోనీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో కూడా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. అయితే, వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై స్పందించిన ఎంఎస్డీ తన నిర్ణయం చెప్పడానికి మరో ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు.
కెరీర్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత కెప్టెన్గా, ఎన్నో మరపురాని విజయాలు అందించిన నాయకుడిగా ధోనీ స్థానం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. గణాంకాలకు మించి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం, విజయాల్లో వినయంగా ఒదిగి ఉండటం వంటి లక్షణాలే ధోనీని అభిమానులకు మరింత చేరువ చేశాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi