తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు30: తమిళనాడు రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం (BUS Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఇటీవల హైదరాబాద్ సరిహద్దులో ఆర్టీసీ బస్సు కంకర లోడ్తో ఉన్న ట్రక్ను ఢీకొని.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.. దీనికంటే ముందు కర్నూలులో ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించి 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.
