టీడీపీతో ప్రారంభం… వైసీపీలో వెలుగు… ఇప్పుడు జనసేన దిశగా? విడదల రజనీ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ


ANDRA PRADESH: రాజకీయాల్లో ప్రచారాలు కొత్తేమీ కాదు. కొన్ని ఊహాగానాలైతే, మరికొన్ని బలమైన సంకేతాలతో సాగుతుంటాయి. వాటిలో కొన్ని నిజాలుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా, వైసీపీకి చెందిన ఓ ప్రముఖ మహిళా నేత, మాజీ మంత్రి విషయంలో తాజాగా వినిపిస్తున్న ప్రచారాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు… గుంటూరు జిల్లాకు చెందిన విడదల రజనీ[VIDADALA RAJANI].


టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన రజనీ, వైసీపీలో కీలక స్థాయికి చేరి, ఇప్పుడు తన భవిష్యత్ రాజకీయ దిశపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

వైసీపీలోకి ఎంట్రీ… టాప్ పొజిషన్ వరకు
విడదల రజనీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. చేరిన వెంటనే పార్టీ ఆమెకు చిలకలూరిపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అక్కడ అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆమెకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు.

ఆమె ఎదుగుదలతో వైసీపీలో ముందు నుంచి ఉన్న కొందరు నేతలు పక్కకు వెళ్లిపోయారని అప్పట్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీని వీడి టీడీపీలో చేరడం కూడా రాజకీయ సమీకరణాలను మార్చింది.

హైకమాండ్‌తో గ్యాప్ ఏర్పడిందా?
ఇటీవల కాలంలో విడదల రజనీకి వైసీపీ హైకమాండ్‌తో కొంత గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం ఊపందుకుంది. 2024 ఎన్నికల్లో ఆమెను గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయించారు. అక్కడ ఓటమి అనంతరం ఆమె మళ్లీ చిలకలూరిపేటకు వచ్చారు.

వైసీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ, పార్టీ గ్రాఫ్ పెరగలేదని, వర్గపోరు ఉందన్న అంచనాతో పార్టీ పెద్దలు ఆమెను రేపల్లెకు షిఫ్ట్ చేసినట్టు సమాచారం. అక్కడ ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై పోటీ చేసి గెలవాలన్న టఫ్ టాస్క్ ఇచ్చారు. దీనిపై రజనీ అసంతృప్తిగా ఉన్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

“పేటే మా రాజకీయ కేంద్రం”
అయితే రజనీ వర్గీయులు మాత్రం చిలకలూరిపేటను వదిలేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తామని అంటున్నారు. రజనీ కూడా ఇదే భావనతో ఉన్నారని సమాచారం. అందుకే తాడేపల్లి కేంద్ర కార్యాలయం వైపు పెద్దగా వెళ్లడం లేదని, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

జనసేన వైపు అడుగులా?
ఇక తాజా హాట్ టాపిక్… విడదల రజనీ జనసేనలో చేరనున్నారన్న ప్రచారం. ఇది కొత్తది కాకపోయినా, ఈసారి మాత్రం “పక్కా” అన్నట్టుగా రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారాన్ని అప్పట్లో ఖండించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, జనసేన అధినాయకత్వం కూడా ఆమె చేరికకు సానుకూలంగా ఉందని టాక్. మరోవైపు ఆమె ప్రత్యర్థి మర్రి రాజశేఖర్ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీ జనసేనలో చేరితే కూటమిలో సమన్వయం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

మొత్తం మీద…
విడదల రజనీ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ఆసక్తికర మలుపుల్లో ఉందనే చెప్పాలి. టీడీపీతో ప్రారంభమై, వైసీపీలో వెలిగిన ఆమె రాజకీయ ప్రయాణం, జనసేన దిశగా సాగుతుందా? లేక వైసీపీలోనే మరో మలుపు తీసుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now