– ‘పెడల్ ఫర్ ఫిట్నెస్’ స్ఫూర్తితో ముందుకు సాగాలి
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 28: ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 28: ఆరోగ్యకర జీవితం తో పాటు కాలుష్య రహిత భవిష్యత్తుకు సైకిల్ సవారీ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. చిన్నారులు, యువత సైక్లింగ్ను ఆనందకర అలవాటుగా మార్చుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా ఆన్ సండేస్’ సైకిల్ రన్ కార్యక్రమం నగరంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద జరిగింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ డా. లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 50 మందికిపైగా చిన్నారులు, క్రీడాశాఖ అధికారులు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి బెంజ్ సర్కిల్, పాలీ క్లినిక్ రోడ్, పీబీ సిద్ధార్థ కళాశాల, రెడ్ సర్కిల్ మీదుగా సుమారు 9 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భావితరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని వారసత్వంగా అందించేందుకు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను హాబీగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఒక మంచి అలవాటు ఎన్నో విజయాలకు దారి తీస్తుందని, అవగాహన పెంచుకుని సైక్లింగ్ను అభిరుచిగా మార్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్డీవో కాకర్ల కోటేశ్వరరావు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సుగుణరావు, కోచ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
