ANDRAPRADESH, NELLURU: త్వరలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం అమలుకు కసరత్తు జరుపుతోంది. అయితే ప్రభుత్వం వీటికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు ఖరారు చేయలేదు. కానీ ప్రభుత్వ పథకాల పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని కావలిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కావలిలో తల్లికి వందనం పథకం పేరుతో ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టకు చెందిన ఓ మహిళకు ఇటీవల ఫోన్ వచ్చింది. అవతలి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తల్లికి వందనం పథకం కింద నగదు రావాలంటే తమ సూచనలను ఫాలో కావాలని చెప్పాడు. తాము చెప్పినట్లు చేయాలని సూచించాడు. అలా చేస్తేనే డబ్బులు జమ అవుతాయని ఆ మహిళను నమ్మించాడు. వాట్సాప్లో ఫోన్పే స్కానర్ ద్వారా తల్లికి వందనం పథకం నగదు జమవుతుందని నమ్మబలికాడు. దీంతో అతను చెప్పినట్లు ఆమె చేసింది. ఫోన్పే స్కాన్ చేసి రూ.15 వేలు ఎంట్రీ చేసింది. అయితే పాస్వర్డ్ నమోదు చేయలేదు కదా.. తన డబ్బులు ఎక్కడికీ వెళ్లవనే ధీమాతో ఉంది.
అయితే ఆ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆ ఆగంతకుడు అయిదుసార్లు రూ.71 వేల వరక ఆమె బ్యాంక్ ఖాతా నుంచి కాజేశాడు. దీంతో వెంటనే ఆ మహిళ కావలి టూటౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను మోసపోయిన సంగతిని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15000 చొప్పున ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కూడా వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.