జవాన్ మురళీ నాయక్‌‌ త్యాగానికి గుర్తుగా ఏపీ సర్కార్ రెండు గొప్ప నిర్ణయాలు.. ఇదే అసలైన నివాళి!


శ్రీసత్యసాయి జిల్లా: దేశ సరిహద్దులో భారతావని కోసం, పౌరుల రక్షణ కోసం, వందకోట్ల మందికి ఊపిరిగా, శత్రువును ఎదురొడ్డి వీరమరణం పొందిన సైనికుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాలో అగ్నివీర్ మురళీనాయక్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది ప్రజలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, సత్యకుమార్, సవిత మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు. ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. దీంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది.

మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరాం నాయక్‌ను మంత్రులు ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్ జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే మురళీ నాయక్ కళ్లి తండా పేరును.. ఇకపై మురళీ నాయక్ తండాగా మార్చాలని సర్పంచ్, గ్రామస్తులు కోరారని మంత్రి లోకేష్ తెలిపారు.. ఆ అంశాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మురళీ నాయక్ పుట్టి పెరిగి కళ్లి తండాకు ఆయన పేరు పెట్టడం ఘనమైన నివాళి అంటున్నారు స్థానికులు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.

మరోవైపు ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఐదెకరాల పొలం, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు చెప్పారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తెలిపారు. లోకేశ్ ఉదయం 8.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కళ్లితండా చేరుకున్నారు. అంత్యక్రియలు ముగిసే వరకు మురళీనాయక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా గంటపాటు వారిని ఓదార్చారు.. అండగా ఉంటామని అభయమిచ్చారు.

'వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.