ANDRAPRADESH: నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్, ఎస్సీ, ఎస్టీ కేసులతో నెల్లూరు జైలులో ఉన్న ఆయనపై రవాణా కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో కాకాణిని ఏ1గా పేర్కొనగా, ఆయన అనుచరులు పది మందిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో ఉన్న కాకాణిని ఇటీవలే పోలీసులు మూడు రోజులు విచారించారు. ఈ విచారణ ముగిసి ఆయనను తిరిగి జైలుకు తరలించిన మరునాడే మరో కేసు నమోదు చేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణి.. తన సొంత నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో ప్రైవేటు టోల్ గేట్ పెట్టి లారీల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని ముత్తుకూరు పోలీసుస్టేషన్ లో బాధితుడు షేక్ ఫరీద్ ఫిర్యాదు చేశారు. కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో కాకాణి, ఆయన అనుచరులు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ముత్తుకూరు పోలీసులు కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా టోల్ గేటు పెట్టినట్లు గుర్తించారని అంటున్నారు. కంటైనర్ క్యారియర్ వాహనాల నుంచి భారీ మొత్తం వసూలు చేశారని, ఒక్కో వాహనం నుంచి రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వరకు దోచుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.44 కోట్లు ఉంటుందని లెక్క వేస్తున్నారు. కృష్ణపట్నం లారీ అసోసియేషన్ ను నిర్వీర్యం చేసి కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అక్రమ దందాకు పాల్పడ్డారని చెబుతున్నారు. దీనికి మాజీ మంత్రి కాకాణి సంపూర్ణంగా సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అప్పట్లో కృష్ణపట్నం లాజిస్టిక్స్ అక్రమ వసూళ్ల వల్ల స్థానికంగా నిర్వహించిన కంటైనర్ టెర్మినల్ ను పోర్టు యాజమాన్యం ఎత్తేసిందని చెబుతున్నారు. వేల మంది కార్మికులు ఆధారపడే ఈ టెర్మినల్ నిర్వహణకు అక్రమ వసూళ్లు ఇబ్బందికరంగా మారడంతో టెర్మినల్ ఎత్తివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా వేల మంది కార్మికులు వీధిన పడడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల అక్రమ దందా ప్రధాన కారణమని టీడీపీ గత కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది.
అయితే ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ప్రైవేటు టోల్ గేటు నిర్వహణ బయటపడలేదు. పోర్టులో కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ స్థాపించిన తర్వాత వాహనాల అద్దెను విపరీతంగా పెంచేసినట్లు చెబుతున్నారు. ఈ చార్జీల మోత భరించలేక సుమారు 60 సంస్థలు తమ కార్యకలాపాలను చెన్నై పోర్టుకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణపట్నంలో కేవలం బొగ్గు, బూడిద దిగుమతి, ఎగుమతులు మాత్రమే కొనసాగుతున్నాయి.