WORLD NEWS: అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల అరెస్టు ఇప్పుడు హింసకు దారి తీస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకొని వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని ట్రంప్ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అమలు చేయటం.. దానికి ప్రాధాన్యత ఇవ్వం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి అందాలకు నెలువుగా పేర్కొనే లాస్ ఏంజెల్స్ మహానగరంలో తాజాగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ వలసల అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని డౌన్ టౌన్ నిరసనలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
దాదాపు 40 లక్షలకు పైనే జనాభా ఉన్న ఈ మహానగరంలో గడిచిన మూడు రోజులుగా సాగుతున్న నిరసనల్ని అణిచి వేసేందుకు నేషనల్ గార్డుల్ని ట్రంప్ సర్కారు రంగంలోకి దించటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటమే కాదు.. హింస చేలరేగుతోంది. ఆదివారం జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు.. రబ్బర్ బుల్లెట్లను.. చెవులు చిల్లులు పడే శబ్దాల్ని ప్రయోగించటంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
దీంతో ఆందోళనకారులు రహదారుల్ని దిగ్బంధించటంతో పాటు.. కార్లను తగలబెట్టారు. ఇదే సమయంలో ఆందోళనలు చెలరేగుతున్న ప్రాంతాలకు 300 మంది నేషనల్ గార్డులు రావటంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టవిరుద్ధంగా సమావేశం కావటాన్ని పోలీసులు నిషేధిస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. దీంతో పలువురు నిరసనకారులు వెళ్లిపోగా.. మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో కాంక్రీట్ ముక్కలు.. రాళ్లను పోలీసుల మీదకు విసిరారు. దీంతో పోలీసులు సురక్షితంగా ఉండేందుకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఆందోళనల్ని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసుల్ని మొహరించారు. పలువురిని అరెస్టు చేశారు. ఫేస్ మాస్కులు పెట్టుకొని ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోనూ డజన్ల కొద్దీ ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరు అంతకు ముందు కొన్ని భవనాల మీదా.. పోలీసు వాహనాల మీదా దాడి చేశారు.
నేషనల్ గార్డుల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించటంతో.. వారిని చూస్తూ ఆందోళనకారులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేషనల్ గార్డుల్ని ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ నకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ లేఖ రాశారు. రాష్ట్ర సౌర్వభౌమత్వాన్ని కాలరాయటమేనన్న ఆయన.. ఈ అంశంపై కోర్టులో కేసు వేస్తామన్నారు. నేషనల్ గార్డుల్ని రంగంలోకి దించటం చట్ట విరుద్ధమని.. అనైతికమని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక రాష్ట్రం కోరకుండా జాతీయ ప్రభుత్వం నేషనల్ గార్డుల్ని రంగంలోకి దించటం గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారిగా చెబతున్నారు. ఈ చర్యల వల్లే ఆందోళనలు హింసాత్మకంగా మారినట్లుగా లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ చెబుతున్నారు. మరో వైపు ఈ తీరును ట్రంప్ తప్పు పట్టారు. హింసను ప్రేరేపించే వారిని వదిలేయలేమని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ తీరును తప్పు పడుతున్న ఎలాన్ మస్క్ మాత్రం.. నేషనల్ గార్డుల్ని రంగంలోకి దించే అంశంపై ట్రంప్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తానని పేర్కొనటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. లాస్ ఏంజెలెస్ లో చోటు చేసుకుంటున్న ఆందోళనలు.. హింసాత్మక చర్యల నేపథ్యంలో అక్కడికి భారీ స్థాయిలో నేషనల్ గార్డుల్ని మొహరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా 2 వేల మంది నేషనల్ గార్డుల్ని లాస్ ఏంజెలెస్ కు పంపాలని అధికారుల్ని ఆదేశించారు. లాస్ ఏంజెలెస్ లో జరుగుతున్న నిరసనల్ని అడ్డుకోవటానికి నేషనల్ గార్డ్స్ సాయంగా పెంటగాన్ 700 మంది మెరైన్ లను మొహరించింది. వీరు ఇమ్రిగ్రేషన్ అధికారుల్ని.. వారి ఆస్తుల్ని రక్షించే పనిలో ఉన్నారు. అయితే.. ఈపరిణామాలపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. మెరైన్ లు అనేక యుద్ధాల్లో సేవలు అందించారని.. వారిని సొంత దేశస్థులకు వ్యతిరేకంగా మొహరించటం సరికాదని.. ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. మరోవైపు గవర్నర్.. మేయర్ తీరును దేశాధ్యక్షుడు ట్రంప్..ఉపాధ్యక్షుడు వాన్స్.. మస్క్ లు తీప్పు పడుతున్నారు.