ANDRAPRADESH, GUNTURU: పోయిన సెల్ఫోన్ వెతికి తెస్తామంటూ ఉచ్చు పన్నారు. వారి మాటల నమ్మి వెళ్లిన ఆశా వర్కర్పై కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా హతమార్చారు. అనంతరం ఆధారాలు లేకుండా మాయం చేశారు. అయితే పోలీసులు పకడ్బందీగా జరిపిన దర్యాప్తులో ముగ్గురు నిందితులు దొరికిపోయారు. కోర్టు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
మూడేళ్ల క్రితం.. అనుపు చెంచు కాలనీకి చెందిన ఆశా వర్కర్ తన సెల్ఫోన్ పొగొట్టుకుంది. ఫోన్ కోసం వెతుకులాడుకుంటూ అదే గ్రామానికి చెందిన ముత్తయ్య వద్దకు వెళ్లింది. తనకు సాయం చేయమని అడిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న శీలం అంజి, సావిటి చిన అంజి, శీలం బైస్వామిలు తమకు తెలిసిన వ్యక్తి వద్దకు వెలితే అతను సెల్ ఫోన్ ఎక్కడుందో చెప్పగలడంటూ ఆమెను నమ్మించారు. వారి మాటలు నిజమనుకుని.. వారితో కలిసి వెళ్లింది.
గ్రామం నుండి కొంతదూరం తీసుకెళ్లిన ముగ్గురు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను అక్కడే హతమార్చారు. ఆమె హత్యకు ఉపయోగించిన బండరాయిని మాయం చేసి అక్కడ నుండి జారుకున్నారు. గ్రామంలో ఆశా వర్కర్ హత్య స్థానికంగా తీవ్రం సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్గా తీసుకుని ఛేదించారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాయ మాలతో ఆమెను నమ్మించి, తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
మూడేళ్లుగా విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా సంచలన తీర్పు నిచ్చింది. ఈ ముగ్గరికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికి డెబ్బై వేల రూపాయల జరిమానా కూడా విధించారు. రెండు లక్షల పది వేల రూపాయలను బాధితురాలి కుటుంబానికి అప్పగించాలని సూచించారు. మహిళను హత్య చేసిన ముగ్గురిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా, దర్యాప్తు అధికారిగా ఉన్న రవిచంద్ర అన్ని ఆధారాలు సేకరించడంతో నిందితులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చేయగలిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లపు కృష్ణ చెప్పారు. అటు పోలీసులు ఇటు న్యాయ వాదులు అందరూ కలిసికట్టుగా పని చేసి నిందితులకు శిక్ష పడేలా చేయగలిగామన్నారు.