WORLD NEWS: మనిషి ఒంట్లో నీరు ఎంత అవసరమో.. రక్తం అవసరం కూడా అంతే. ప్రమాదం జరిగినా.. కీలకమైన సర్జరీ చేయాలన్నా సదరు పేషెంట్ కు సూట్ అయ్యే రక్తం చాలా అవసరం. ఒకవేళ సరిపోయే రక్తం అందుబాటులో లేకుంటే సదరు పేషెంట్ కు సూట్ అయ్యే బ్లడ్ ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి రక్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రక్తాన్ని ప్రాణాధారంగా భావిస్తారు. అయితే.. అవసరమైన రక్తం దొరక్క కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి. ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదురు కాకుండా.. 24 గంటలు అవసరమైన రక్తం అందుబాటులో ఉండేందుకు వీలుగా కృత్రిమ రక్తాన్ని తయారు చేసే దిశగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిశోధనలకు సంబంధించి జపాన్ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కృత్రిమ రక్తం దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి కానీ సక్సెస్ అయితే..కోట్లాది మంది ప్రాణాల్ని కాపాడే వీలు ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ బ్లడ్ అవసరాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. 2008 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక్క భారతదేశంలోనే కోటి యూనిట్ల రక్తం. అయితే అందుబాటులో ఉన్నది 40 లక్షల యూనిట్లే. 2018 నాటి లెక్కల ప్రకారం అవసరసమైన బ్లడ్ 2.65 కోట్ల యూనిట్లు. ఈ లెక్కన ఇప్పుడు ఈ డిమాండ్ ఇంకెంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి వేళ.. కృత్రిమ రక్తం అవసరం పెరుగుతున్న పరిస్థితి. మొట్టమొదటి రక్త మార్పిడి 1665లో ఇంగ్లండ్ లో జరగ్గా..అది కుక్కల రక్తాన్ని కుక్కలకు వినియోగించారు. 1818లో బ్రిటిష్ వైద్యుడు జేమ్స్ బ్లండెల్ మనుషుల్లో రక్తమార్పిడిని విజయవంతంగా నిర్వమించారు. ఆ తర్వాత న్యూయార్క్ లో థియోడర్ గెయిలార్డ్ థామస్ అనే గైనిక్ వైద్యుడు రక్తానికి బదులుగా ఆవుపాలను వాడారు. 1875లో తన దగ్గరకు తీవ్ర రక్తస్రావంతో వచ్చిన మహిళకు 175 మిల్లీ లీటర్ల ఆవుపాలను ఎక్కించాడు. వారం పాటు జ్వరం.. గుండె వేగంగా కొట్టుకోవటంలో సమస్యలు ఎదురైనా.. తర్వాత అవన్నీ సర్దుకున్నట్లుగా గుర్తించారు. 1880 వరకు రక్తానికి బదులుగా ఆవు.. మేకపాలు ఎక్కించటం అమెరికా అంతా ఉండేది.
ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతతో కృత్రిమ రక్తాన్ని ప్రయోగశాలల్లో డెవలప్ చేశారు. జపాన్ లోని నారా మెడికల్ వర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక భూమిక పోషించారు. వీరు చేస్తున్న పరిశోధన మానవాళికి బ్రేక్ త్రూగా భావిస్తున్నారు. పాడైన మనిషి రక్తాన్ని మంచి రక్తంగా అది కూడా కృత్రిమ రక్తాన్ని తయారు చేసేలా దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. మనిషి రక్తంలోని హిమోగ్లోబిన్ ను వేరు చేసి.. దానిని ఎలాంటి వైరస్ లూ సోకేందుకు అవకాశం లేకుండా ప్రత్యేక షెల్ లో ఉంచి.. కొన్ని ప్రత్యేక పద్దతుల ద్వారా కృత్రిమ రక్తాన్ని తయారుచేశారు.
ప్రస్తుతం ఈ ప్రయోగానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీ లీటర్ల కృత్రిమ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. చువో వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెరియుకి కొమట్సు టీం.. ప్లాస్మాలోని అల్బుమిన్ తో దీన్ని రూపొందించారు. ఇది రక్తపోటును నియంత్రించేందుకు.. గుండెపోటు రాకుండా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే.. 2030 నాటికి కృత్రిమ రక్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. మానవాళికి మరింత మేలు జరుగుతుందని చెప్పక తప్పదు.