ఖతర్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడి
దాడి నేపథ్యంలో దోహాలోని మాల్లో భయాందోళనతో ప్రజల పరుగులు
క్షిపణులను అడ్డుకున్నామని, ప్రాణనష్టం లేదని స్పష్టం చేసిన ఖతర్
తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతీకారంగా ఖతర్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ నిన్న క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనతో అస్థిరంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఖతార్ రాజధాని దోహాలో పేలుడు శబ్దాలు వినిపించడంతో, నగరంలోని ఒక షాపింగ్ మాల్ నుంచి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాల్లో ఉన్న పురుషులు, మహిళలు, పిల్లలు ఒక్కసారిగా భయాందోళనలతో బయటకు పరుగులు తీయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్, అమెరికాకు చెందిన యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంగా ఉన్న అల్ ఉదెయిద్ వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేసిన తర్వాత దోహాలోని విల్లాజియో మాల్లో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.
ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ఇరాన్ ఈ దాడిని ధ్రువీకరించింది. తమ అణు కార్యక్రమాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఖతర్లోని అల్ ఉదెయిద్ వైమానిక స్థావరంలో మోహరించిన దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
ఖతర్ స్పందన.. అమెరికా ధ్రువీకరణ
ఈ దాడులపై ఖతార్ స్పందిస్తూ ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దేశంలోకి వచ్చే, బయటకు వెళ్లే విమానాలను నిలిపివేసినట్టు ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. కొన్ని గంటల తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించారు. కాగా, ఇరాన్ దాడిలో అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అమెరికా రక్షణ అధికారి ఒకరు ఏఎఫ్పీ వార్తా సంస్థతో చెప్పినట్టు తెలిసింది.