గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి, సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ హెడ్ అనుజ్ చండే మాట్లాడుతూ... "ఈ ఏడాది 'ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్' నివేదికలోని అంశాలు ఈ రెండు గొప్ప దేశాల మధ్య ఉన్న లోతైన, చారిత్రక సంబంధానికి నిదర్శనం. భారతీయ కంపెనీలు వృద్ధి చెందడానికి యూకేను ఒక కీలక పెట్టుబడి కేంద్రంగా భారత్ చూస్తోందని స్పష్టమవుతోంది" అని తెలిపారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో రూపొందిన ఈ నివేదిక, ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) చేరికతో మరింత బలోపేతమైంది. ఐజీఎఫ్ తన దీర్ఘకాల అనుభవం, నైపుణ్యం, భారత్-యూకే కారిడార్లో ఉన్న పలుకుబడితో ఈ నివేదికకు మరింత విలువ చేకూర్చింది. లండన్లోని క్వీన్ ఎలిజబెత్-II సెంటర్లో ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రారంభ సెషన్లో యూకే వాణిజ్య, వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.
"విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటాస్ 448 శాతం ఆదాయ వృద్ధితో వృద్ధి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా ప్రవేశించిన కార్పొరేట్ ఐటీ మేనేజ్మెంట్ సంస్థ జోహో కార్పొరేషన్ లిమిటెడ్ 197 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో ఉంది" అని నివేదిక పేర్కొంది.
కంపెనీల ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే, లండన్ మొదటి చాయిస్గా కొనసాగుతోంది. మొత్తం కంపెనీలలో 47 శాతం లండన్లోనే ఉన్నాయి. ఆ తర్వాత సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ (24.3 శాతం) ఉంది. రంగాల వారీగా చూస్తే, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) రంగం 31 శాతం ట్రాకర్ కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అలాగే ఫార్మాస్యూటికల్స్, రసాయనాల రంగం 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. లండన్ గ్లోబల్ ఫైనాన్స్ హబ్లో భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యూహాత్మక విస్తరణ కారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కూడా ట్రాకర్ కంపెనీలలో 9.5 శాతానికి పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.