బ్రిటన్‌లో భారతీయ సంస్థల హవా.. భారీగా పెరిగిన ఆదాయం, ఉద్యోగాలు!

బ్రిటన్‌లో గణనీయంగా పెరిగిన భారతీయ కంపెనీల సంఖ్య

2024లో 971 ఉండగా.. 2025 నాటికి 1,197కు చేరిక

భారత సంస్థల ద్వారా 72.14 బిలియన్ పౌండ్ల ఆదాయం

1.26 లక్షల మందికి ఉపాధి

'ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్' నివేదికలో వెల్లడి

లండన్ భారత కంపెనీలకు ప్రధాన కేంద్రంగా కొనసాగింపు

టెక్నాలజీ, మీడియా, టెలికాం (టీఎంటీ) రంగంలో అత్యధిక సంస్థలు

భారత్, బ్రిట‌న్‌ మధ్య ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతోందని చెప్పడానికి నిదర్శనంగా, బ్రిటన్‌లో పనిచేస్తున్న భారతీయ యాజమాన్యంలోని కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2024లో 971గా ఉన్న ఈ సంస్థల సంఖ్య, 2025 నాటికి 23 శాతానికి పైగా వృద్ధితో 1,197కు చేరింది. 2017లో గ్రాంట్ థోర్న్టన్ సంస్థ కచ్చితమైన సంఖ్యలను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధిక పెరుగుదల కావడం విశేషం.

ఈ భారతీయ కంపెనీలు యూకేలో సంపాదించిన మొత్తం ఆదాయం కూడా 2024లోని 68.09 బిలియన్ పౌండ్ల నుంచి 72.14 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈ వ్యాపార సంస్థలు యూకే వ్యాప్తంగా 1,26,720 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. గత ఏడాది కాలంలోనే 8,000కు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాయి. 

"ఈ కంపెనీలలో మహిళా డైరెక్టర్ల నిష్పత్తి కూడా 2024లో 21 శాతం ఉండగా, అది 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో 74 సంస్థలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి" అని నివేదిక ప్రస్తావించింది.

గ్రాంట్ థోర్న్టన్ భాగస్వామి, సౌత్ ఏషియా బిజినెస్ గ్రూప్ హెడ్ అనుజ్ చండే మాట్లాడుతూ... "ఈ ఏడాది 'ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్' నివేదికలోని అంశాలు ఈ రెండు గొప్ప దేశాల మధ్య ఉన్న లోతైన, చారిత్రక సంబంధానికి నిదర్శనం. భారతీయ కంపెనీలు వృద్ధి చెందడానికి యూకేను ఒక కీలక పెట్టుబడి కేంద్రంగా భారత్ చూస్తోందని స్పష్టమవుతోంది" అని తెలిపారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారంతో రూపొందిన ఈ నివేదిక, ఇండియా గ్లోబల్ ఫోరం (ఐజీఎఫ్) చేరికతో మరింత బలోపేతమైంది. ఐజీఎఫ్ తన దీర్ఘకాల అనుభవం, నైపుణ్యం, భారత్-యూకే కారిడార్‌లో ఉన్న పలుకుబడితో ఈ నివేదికకు మరింత విలువ చేకూర్చింది. లండన్‌లోని క్వీన్ ఎలిజబెత్-II సెంటర్‌లో ఐజీఎఫ్ లండన్ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక ప్రారంభ సెషన్‌లో యూకే వాణిజ్య, వ్యాపార శాఖ మంత్రి జోనాథన్ రేనాల్డ్స్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేశారు.

"విప్రో ఐటీ సర్వీసెస్ యూకే సొసైటాస్ 448 శాతం ఆదాయ వృద్ధితో వృద్ధి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా ప్రవేశించిన కార్పొరేట్ ఐటీ మేనేజ్‌మెంట్ సంస్థ జోహో కార్పొరేషన్ లిమిటెడ్ 197 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో ఉంది" అని నివేదిక పేర్కొంది.

కంపెనీల ప్రధాన కార్యాలయాల పరంగా చూస్తే, లండన్ మొదటి చాయిస్‌గా కొనసాగుతోంది. మొత్తం కంపెనీలలో 47 శాతం లండన్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత సౌత్ ఆఫ్ ఇంగ్లాండ్ (24.3 శాతం) ఉంది. రంగాల వారీగా చూస్తే, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) రంగం 31 శాతం ట్రాకర్ కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అలాగే ఫార్మాస్యూటికల్స్, రసాయనాల రంగం 22 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. లండన్ గ్లోబల్ ఫైనాన్స్ హబ్‌లో భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వ్యూహాత్మక విస్తరణ కారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కూడా ట్రాకర్ కంపెనీలలో 9.5 శాతానికి పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.