రాష్ట్రానికి 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం


*ముగిసిన రెండు రోజుల జోనల్ విత్తన సమీక్ష సదస్సు
*నాణ్యమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా 7 పంటలలో బ్రీడర్ విత్తనాల సరఫరాకు అనుమతి 
*5 సంవత్సరాల లోపు పరిశోధన స్థానముల నుండి విడుదలైన అపరాల బ్రీడర్ విత్తనాలను రాయితీ పై సరఫరాకు చేర్చిన కేంద్ర ప్రభుత్వం
*డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్, విజయవాడ: భారత ప్రభుత్వ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విత్తన విభాగం వారి ఆధ్వర్యములో జాతీయ స్థాయిలో మన దేశంలోని అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల వ్యవసాయ శాఖాది పతులతో జాతీయ స్థాయి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ విత్తన పరిశోధనా సంస్థలు, సరఫరా సంస్థలతో రెండురోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో ఖరీఫ్ 2025 జోనల్ విత్తన సమీక్ష సమావేశం జరిగింది. 
    
ఈ సమావేశమునకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన అజిత్ కుమార్ సాహూ ఐఏఎస్ సంయుక్త కార్యదర్శి - విత్తనములు వారి ఆధ్వర్యములో జరిగింది. చందర్ మోహన్ , విత్తన సహాయ కమిషనర్ మరియు అదనపు డైరెక్టర్ జనరల్ ఐకార్ లు వేదికపై ఆసీనులయ్యారు .
 
మొదటి రోజు ఖరీఫ్ 2025 సీజన్ కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ప్రతిపాదించిన విత్తన రకాల ఎంపిక, వాటి లభ్యత, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ విత్తనోత్పత్తి పధకం, రైతు స్థాయిలో ధ్రువీకరణ విత్తనాల విత్తనోత్పత్తి తదితర అంశాలపై చర్చించారు . 

రెండవరోజు జరిగిన సదస్సులో ప్రతిష్ఠాత్మక పరిశోధనా క్షేత్రంలు, సంస్థల ద్వారా కొత్తగా విడుదలైన అధికదిగుబడి నిచ్చే వంగడాలు, నోటిఫైడ్ రకాల విత్తనముల లక్షణాలు, వాటి దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే అంశాలను వివరించారు.

బ్రీడర్ విత్తనాల ప్రాముఖ్యత.. తెలుపుతూ రైతులే వారి క్షేత్రాలలో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకునేలా 7 పంటలకు అనగా వేరుశనగ, వరి, కంది, పెసర, మినుము, రాగి మరియు సజ్జ పంటల బ్రీడర్ విత్తనాలును రాయితీ కల్పించటం జరిగిందని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీఫ్ సీజన్ 2026 నుండి బ్రీడర్ విత్తనం సాగు నుండి తరువాతి సీజన్ కు మూల (ఫౌండేషన్) విత్తనముగా మరియు వాటి నుండి తదుపరి సీజన్ కు ధ్రువీకరించిన (సర్టిఫైడ్) విత్తనముగా ప్రత్యుత్పత్తి చేసుకుంటూ 2027 - 28 సంవత్సరానికల్ల రైతు స్థాయిలో నాణ్యమైన విత్తన ఉత్పత్తి చేసుకునే విధముగా ప్రణాళికలను రాష్ట్రాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలకు అనుగుణముగా బ్రీడర్ విత్తనాలను రాయితీపై సరఫరాకు అనుమతి ఇచ్చామని సమావేశం తెలిపింది .
      
మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంచాలకులు తరుపున పాల్గొన్న విత్తన సంయుక్త సంచాలకులు కృపదాస్ మాట్లాడుతూ ఈ సమావేశములో మనరాష్ట్ర ప్రతిపాదనలకు 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాలను 7 పంటలకు రాయితీపై సరఫరాకు ఆమోదం తెలుపటం చాలా ఆనంద దాయకం అని, వీటి సరఫరా 1736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాలద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులే ఉత్పత్తి చేసుకునేలా 2027 -28 సంవత్సరానికి (మూడవ సీజన్ కు) ఆ పంటలలో ఎటువంటి కొరత రాకుండా 3,35,720 క్వింటాళ్ల ధ్రువీకరణ (సర్టిఫైడ్) విత్తనాలను ముందస్తు వ్యూహం ప్రణాళికతో వ్యయసాయ సంచాలకులు డిల్లీ రావు వారి ఆదేశాల ప్రకారం కార్యాచరణ చేపడతామని తెలిపారు.