INDIA NEWS: గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే విమానం కుప్పకూలి మంటల్లో దగ్దమైంది. ఈ సందర్భంగా 265 మరణాలు సంభవించడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను విమానయాన సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా.. విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. ప్రాణాలతో బయట పడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడిగా తెలిపింది.
అతనొక్కరే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక.. మొత్తం మృతుల్లో 229 మంది విమాన ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది అని వెల్లడించింది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ వాసులు, ఒక కెనడా దేశస్థుడు ఉన్నట్లు తెలిపింది.
మరో ఘోరమైన విషయం ఏమిటంటే... ఈ విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో... ఈ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. మరికొంతమంది మెడికోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా 242 మందితో ఉన్న ఎయిరిండియా విమానం మేఘనినగర్ నివాస ప్రాంతంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన క్షణాలోనే పైకి లేవడానికి ఇబ్బంది పడుతూ.. బిల్డింగ్స్ ని ఢీకొని అగ్నిగోళంగా పేలిపోయింది. ఆ సమయంలో చుట్టూ పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆవహించింది!
విమానంలో ఉన్నవారిలో 230 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది. వీరిలో 11ఏలో కూర్చున్న ప్రయాణికుడు తప్ప ఇంకెవరూ ప్రాణాలతో బయటపడలేదు. అతడు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
సరిగ్గా భోజన విరామ సమయంలో విమానం వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ పై కూలిపోయింది. దీంతో.. భోజనం చేస్తున్న మెడికోల్లో సుమారు 24 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. గాయపడిన వారు ప్రస్తుతం అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు!
ప్రమాదానికి గురైన విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్లకు పైగా ఇంధనం ఉందని.. అదంతా ఒక్కసారిగా పేలడంతో ప్రమాద స్థలంలో టెంపరేచర్ 1,000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయని సహాయక సిబ్బంది తెలిపారు. మంటల తీవ్రత కారణంగా ఏ ఒక్కరినీ రక్షించడం అసాధ్యంగా మారిందని అమిత్ షా అన్నారు.
ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి (ఏఏఐబీ) ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
దర్యాప్తులో విదేశాంగ కార్యదర్శి, భారత అధికారులతో సమన్వయం చేసుకుంటారని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ భయంకరమైన విమాన ప్రమాదం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చ్చారు. తాము చేయగలిగిన సహాయం అంతా చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎయిరిండియా మాతృ సంస్థ టాటా గ్రూపు.. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ప్రకటించింది. ఇదే సమయంలో గాయపడినవారికి పూర్తి వైద్య ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించింది.