INDIA NEWS: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ-171.. గురువారం మధ్యాహ్నం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించగా... తాజాగా మృతుల సంఖ్యపై స్పందిస్తూ.. అందరూ మరణించారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ షాకింగ్ విషయం తెలిపారు!
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది మరణించారు. ఈ సందర్భంగా స్పందించిన అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ స్పందిస్తూ.. ప్రమాదం నుంచి ఎవరూ బ్రతికినట్లు లేరని అన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు!
ఇదే సమయంలో మృతుల్లో పలువురు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు. దీనిపై తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటించింది! ఇదే సమయంలో.. విమానంలో ఉన్న 242 మంది మృతి చెందారని తెలిపింది!
మరోవైపు విమాన ప్రమాదంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్ష కోసం ప్రయాణికుల బంధువులు శాంపుల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలిపారు.
మెడికల్ స్టూడెంట్స్ పరిస్థితిపై ‘ఫైమా’ పోస్ట్!:
ఇదే సమయంలో.. విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోవడంతో పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారని.. చాలా మంది గాయపడ్డారని ప్రచారం జరుగుతోన్న వేళ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్.ఏ.ఐ.ఎం.ఏ.) ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా విద్యార్థుల పరిస్థితిని వివరించింది.
ఇందులో భాగంగా... 50 మంది విద్యార్థులు గాయాలతో ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడా ఉందని.. అయితే 4 - 5 మంది విద్యార్థుల ఆచూకీ తెలియయడం లేదని.. మరో ఇద్దరు, ముగ్గురి పరిస్థితి కాస్త క్రిటకల్ గా ఉందని.. 3 - 4 మంది రెసిడెంట్ డాక్టర్ల బంధువుల ఆచూకీ తెలియడం లేదని.. ఒక సూపర్ స్పెషలిస్ట్ భార్య చనిపోయిందని తేలిందని తెలిపింది!