సజ్జలకు ఉచ్చు బిగించేస్తున్న రఘురామ..


ANDRAPRADESH: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కాగా, తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతి నిరసనకారులను 'పిశాచులు', 'రాక్షసులు', 'సంకర తెగ' అంటూ సజ్జల వ్యాఖ్యానించడంపై రఘురామకృష్ణం రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 


ఈ కేసులో యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఓ న్యూస్ మీడియాలో జరిగిన ఒక డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిలో 'వేశ్యలు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ హోదాలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను నిలువరించే ప్రయత్నం చేయకపోగా, సమర్థించినట్టుగా వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. రాజధాని మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ జరిగింది. 

రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ ఘటనపై స్పందించారు. ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిశాచులతో పోల్చిన వైనం.. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఘటన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను 'పిశాచులు', 'రాక్షసులు' అంటూ వ్యాఖ్యానించారు. 

అంతటితో ఆగకుండా 'సంకర తెగ' అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ 'ఆర్గనైజ్డ్ గా ఉన్న సంకర తెగ' అంటూ సజ్జల అనడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదుతోనే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ జరిగింది. అయితే అమరావతి మహిళా రైతుల నిరసనను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. 

డీజీపీకి ఫిర్యాదు తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్పందించారు. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కుల వివక్షకు సంబంధించిన పదప్రయోగం చేస్తూ.. సజ్జల దూషణలకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతిలోని వేలాదిమంది మనోభావాలను దెబ్బతీశారని.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో అలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. 

వరుసగా అమరావతి రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరెస్ట్ కాబోతుండడం సంచలనంగా మారింది.. మరోవైపు జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మొత్తానికి అమరావతి మహిళలపై కామెంట్స్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తప్పేలా లేవు.