INDIA, UTHARAKHANDA: అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇంకా మృతులను గుర్తు పట్టలేదు, శిథిలాలను క్లియర్ చేయలేదు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.. ఈ లోపే మరో ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
అహ్మదాబాద్ లో ఎయిరిండియా ఘోర ప్రమాదపు రక్తపు మరకలు ఇంకా ఆరనేలేదు, ఆర్తనాథాలు ఆగనేలేదు, అలుముకున్న విషాధ ఛాయలు తగ్గలేదు.. ఇంతలోనే మరో ఘోరం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.... ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి, పైలెట్ సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
వివరాళ్లోకి వెళ్తే... ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఉత్తరాఖండ్, ఉతరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ కు బయలుదేరింది. ఆ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడంతో 10 నిమిషాల్లోనే కుప్పకూలిందని చెబుతున్నారు.
ఈ మేరకు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (యూసీఏడీఏ) ఈ వివరాలు వెల్లడించింది. హెలికాప్టర్ కుప్పకూలిందన్న్న సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంత చేయాలన్ని అధికారులను ఆదేశించారు.
మే 2న కేదార్ నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది ఐదో ప్రమాదం కావడం గమనార్హం. ఈ నెల 7న ఉత్తర ప్రదేశ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ నాథ్ కు వెళ్తున్న ఓ హెలికాప్టర్ బాదాసుబేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తడమో ఉత్తరాఖండ్ లోని ఓ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో.. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పడి సమీపంలోని కొన్ని భవంతులు, రోడ్డుపై ఆగి ఉన్న కారు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే జరిగిన తాజా ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు.