మూడవ విడత వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం నగదు జమ

జిల్లాలో రూ. 18.99 కోట్లు లబ్దిపొందిన 12,660 మంది అగ్రవర్ణ పేద మహిళలు: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్. 

ఏలూరు: వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం  కింద 3వ విడతలో జిల్లాలో 12,660 మంది అగ్రవర్ణ పేద మహిళల లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. 18.99కోట్లు  ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. వై.ఎస్.ఆర్. 3వ విడత ఇ.బి.సి. నేస్తం కింద రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కా, చెల్లెళ్లకు రూ.629.37 కోట్ల ఆర్ధిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేసే బృహత్తర కార్యక్రమాన్ని గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్,  డిఆర్ డిఎ పిడి డా. ఆర్. విజయరాజు, బి.సి. కార్పోరేషన్ ఇడి పుష్పలత, జిల్లా బి.సి . సంక్షేమాధికారి ఆర్. నాగరాణి, మైనారిటీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు, పలువురు లబ్దిదారులు  తిలకించారు.  అనంతరం జిల్లాలోని  సంబంధిత లబ్దిదారులకు చెందిన నమూనా మెగా చెక్కును జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ లబ్దిదారులకు అందజేశారు. 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ  మూడు విడతల్లో రూ.15 వేల వంతున వెరశి రూ.45 వేలు ఆర్ధిక సహాయం అందించడంలో భాగంగా వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం పథకం కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు మిగిలిన ఓసీ సామాజిక వర్గానికి చెందిన 45 ఏళ్ల నుంచి 60ఏళ్లు వరకు గల నిరుపేద మహిళలకు రూ.15వేలు చొప్పున మూడవ విడత నిధులు నేడు విడుదల చేయడం జరిగిందన్నారు.  

తద్వారా ఏలూరు జిల్లాలో 12,660 మంది రూ. 18.99 కోట్లు లబ్ది పొందటం జరిగిందన్నారు.  దెందులూరు నియోజకవర్గంలో  1,752 లబ్దిదారులకు రూ. 2.63 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 2,198 లబ్దిదారులకు రూ. 3.30 కోట్లు, చింతలపూడి నియోజకవర్గంలో  2,669 లబ్దిదారులకు రూ. 4.00 కోట్లు,  ఏలూరు నియోజకవర్గంలో 972 లబ్దిదారులకు రూ. 1.46 కోట్లు, పోలవరం నియోజకవర్గంలో 1,748 లబ్దిదారులకు రూ. 2.62 కోట్లు,  కైకలూరు నియోజకవర్గంలో 1,548 లబ్దిదారులకు రూ. 2.32 కోట్లు, ఉంగుటూరు నియోజకవర్గంలో 1,045 లబ్దిదారులకు  రూ. 1.57 కోట్లు, గోపాలపురం నియోజక వర్గంలో ద్వారక తిరుమల లో 728 లబ్దిదారులకు రూ. 1.09 కోట్లు లబ్దిదారుల ఖాతాలకు విడుదల అయినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.