ANDRAPRADESH: ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ దారుణ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన వైఎస్ భారతికి అండగా నిలుస్తానని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తన అన్నతో ఆస్తి వివాదాలు ఉన్నా, సాటి మహిళగా భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోదరుడు జగన్ తో పాటు వదిన భారతిపైనా కొన్నాళ్లుగా కోపంగా ఉన్న షర్మిల ఇలా అనూహ్యంగా మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కష్టకాలంలో మహిళగా స్పందించి తన ప్రత్యేకత చాటుకున్న షర్మిలపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తన వదిన వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. మహిళలపై తప్పుడు ప్రచారం చేసే సైకోగాళ్లను క్షమించొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేనట్లు కేవలం ఏపీలోనే ఇలాంటి కాలకేయులు ఉన్నారని, వారిని తయారు చేసింది వైసీపీ, టీడీపీయేనంటూ విమర్శలు గుప్పించారు. తన వదినకు జరిగిన అవమానంపై షర్మిల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం.
ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి.’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీయేనంటూ ధ్వజమెత్తారు. ‘‘వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు.
మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి.’’ అంటూ ట్వీట్ చేసిన షర్మిల వైసీపీని కూడా టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. గతంలో తనపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన ప్రచారాన్ని షర్మిల పరోక్షంగా ప్రస్తావించి ఆ పార్టీతోపాటు టీడీపీ కూడా ఇలాంటి విష సంస్కృతి తెచ్చిందని షర్మిల ఫైర్ అయ్యారు.