ANDRAPRADESH: రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. జగనన్న మహిళలకు పెద్దపీట వేశారు.. జగనన్న దిశా యాప్ తెస్తే ఆ యాప్ ను ప్రస్తుత హోంమంత్రి హేళనగా మాట్లాడారు.. కానీ, ఇప్పుడు అదే దిశా యాప్ పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పెట్టారని ఎద్దేవా చేసింది.
దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తే లోకేష్ తెలుగు మహిళలందరినీ పోగేసి ఆ ప్రతులను తగలబెట్టించారు.. ఏపీని శ్రీలంక చేసేస్తున్నారు.. ప్రజలను సోమరిపోతులను చేసేస్తున్నారని బురదజల్లారు.. జగనన్నను విమర్శించి అంతకంటే ఎక్కువ పథకాలిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశారు అని తానేటి వనిత పేర్కొనింది. అయితే, ప్రజలకు పథకాలు ఇవ్వాలని ఉన్నా కానీ, భయమేస్తోందని చంద్రబాబు చెబుతున్నారు.. 40 ఏళ్ల సీనియర్ అని చెప్పుకునే నాయకుడు అలా చెప్పడమేంటి అని మాజీ హోంమంత్రి వనతి ప్రశ్నించింది.
అమ్మఒడి పథకంలో 1000 రూపాయలు పాఠశాలల నిర్వహణకు తీసుకుంటే నారా లోకేష్ అనరాని మాటలు అన్నారు.. మరి ఇప్పుడు తల్లికి వందనం పథకంలో లోకేష్ 2 వేలు కోత పెట్టారు అని మండిపడింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించింది. ఏడాది కాలంగా ఎంతోమంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి.. హోంమంత్రి అనిత కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పింది లేదని తానేటి వనతి పేర్కొనింది.
ఇక, హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరి మారారు అని మాజీ మంత్రి వనిత మండిపడింది. వైసీపీ వాళ్లకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెబుతున్నారు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందించాలని జగన్ చెప్పారు.. చంద్రబాబుకి.. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇదే అని ఆమె తెలిపింది.
రాష్ట్రం రావణకాష్టంలాగా మారింది.. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.. ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.. 33 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారన్నారు.. మరి ఇప్పుడు ఆ కనిపించకుండా పోయిన మహిళలను ఎవరు కనిపెట్టి తెస్తారని అడిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనవ్రతం దాల్చారు.. పవన్ ఎందుకు మౌనవ్రతం దాల్చారో చెప్పాలని తానేటి వనిత క్వశ్చన్ చేసింది.