ఒకే రోజు కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కార్యక్రమాలు
విజయవాడలో పర్యాటక రంగంపై కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం విజయవాడలో జరిగిన జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో సీఎం పాల్గొననున్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధికారులు, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలకు చేరుకుని, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025’ ను ప్రారంభించనున్నారు. పోలీస్ వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
అక్కడి నుంచి పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును చంద్రబాబు పరిశీలించనున్నారు. పట్టణ వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం ఆయన ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi