వైసీపీ శ్రేణులకు జగన్ అతిపెద్ద అస్త్రం..? ఒకే దెబ్బకు రెండు..!


ఏపీలో గత ఎన్నికలకు ముందు అధికారికంగా 151 సీట్లు అనధికారికంగా మరో ఐదు సీట్లు కలుపుకుంటే మొత్తం 156 సీట్లతో పటిష్టంగా కనిపించిన జగన్ ఆ తర్వాత మాత్రం 11 సీట్లకు పరిమితమై చరిత్రలోనే చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇది అంతిమంగా వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని సైతం నైరాశ్యంలోకి నెట్టేసింది. దీన్నుంచి క్రమంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న జగన్.. తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇచ్చారు

ఇప్పటివరకూ చంద్రబాబు ప్రభుత్వం తమను కేసులతో టార్గెట్ చేస్తుందని పదే పదే ఆరోపిస్తున్న జగన్.. ఇప్పుడు రూటు మార్చి మరో విధంగా ఇరుకునపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం తాజాగా ఓ కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు. దాని పేరే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో. మ్యానిఫెస్టో అమల్లో తిరుగులేని రికార్డు ఉన్న జగన్.. గతంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం పైగా ఏదో విధంగా నిలబెట్టుకున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు హామీల్ని నిలబెట్టుకునే అలవాటు లేదని జగన్ పదే పదే చెప్తుంటారు.

ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో అంటూ కొత్త కార్యక్రమం సిద్ధం చేశారు. బహుశా వైసీపీకి వచ్చే నాలుగేళ్లలో ఇంతకంటే పెద్ద రాజకీయ అస్త్రం దొరక్కపోవచ్చనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. దీనికి కారణం మ్యానిఫెస్టోల అమల్లో జగన్, చంద్రబాబుకూ ఉన్న వైరుధ్యమే. ముఖ్యంగా గతంలో సంక్షేమంతో నిండిపోయిన మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేసి చూపించిన జగన్.. ఇప్పుడు చంద్రబాబు అదే సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జనానికి చెప్పేందుకు ఈ కార్యక్రమం కచ్చితంగా పనికొస్తుందన్న వాదన వినిపిస్తోంది.

ఇప్పటికే కూటమి సర్కార్ ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీల అమల్లో విఫలమైందని అన్ని సర్వేలు ముక్తకంఠంతో తేల్చేశాయి. వైసీపీ అయితే ఈ విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో సహజంగానే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. దీని ఫలితమే తాజాగా చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం. త్వరలో అమలు చేస్తామంటున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకాలు. ఈ క్రమంలోనే నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తామని లోకేష్ తాజాగా ప్రకటన చేశారు. తద్వారా సంక్షేమాన్ని పక్కనబెట్టేశారన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో జగన్ చంద్రబాబు మ్యానిఫెస్టో అమలు సరిగా చేయడం లేదంటూ జనంలోకి వెళ్తే మంచి స్పందన రావచ్చనే చర్చ జరుగుతోంది.