విజయనగరం జిల్లాలో పతంజలి కంపెనీ... స్థలాన్ని పరిశీలించిన రాందేవ్ బాబా

కొత్తవలసలో పతంజలి భారీ పరిశ్రమ

172 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామన్న రాందేవ్ బాబా

చంద్రబాబు విజనరీ లీడర్ అని ప్రశంస

ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ స్వయంగా జిల్లాలో పర్యటించి, పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.

విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు బాబా రాందేవ్ మీడియాకు వివరించారు. ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బాబా రాందేవ్ ‘దూరదృష్టి గల నాయకుడు’ (విజనరీ లీడర్) అని ప్రశంసించారు. ఆయన నాయకత్వ పటిమ, సహకారం వల్లే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు.

పతంజలి వంటి జాతీయ స్థాయి సంస్థ విజయనగరం జిల్లాలో భారీ పరిశ్రమను స్థాపించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపు వస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi