మూడురోజులు భారీవర్షాలు, భద్రమన్న బంగాళాఖాతం.. మత్స్యకారులకు అలెర్ట్!


నైరుతి రుతుపవనాలకు తోడు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మత్స్యకారులకు

హెచ్చరిక గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరికలను జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రంలో నేడు పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలలో భారీ వర్షాలు

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇది మాత్రమే కాక కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన 

ఈ ప్రాంతాల్లో వాతావరణ శాఖ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక ఏపీలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షాలు ఎక్కువగా కురిస్తే అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

చెరువులు, కాలువలు పొంగి పొర్లే అవకాశం

రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వర్షంతో చెరువులు కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రజలు అటువంటి ప్రాంతాలలో అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi