పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు మృతి!


 కాకినాడ జిల్లా కొమరగిరిలో విషాదం

యాక్సిడెంట్‌లో నవ దంపతులు మృతి

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు


ANDHAR PRADESH: కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే నవ దంపతులు యాక్సిడెంట్‌లో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆర్కే బీచ్‌కి వెళ్తుండగా బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొమరగిరికి చెందిన సాయి నాగేంద్ర వైజాగ్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ల్యాబ్‌లో గాజువాకకు చెందిన శాలిని పనిచేస్తోంది. సాయి నాగేంద్ర, శాలిని గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు ఓపికగా ఎదురుచూశారు. చివరకు పెద్దలను ఒప్పించి గత నెల 11న శాలిని, నాగేంద్ర పెళ్లి చేసుకున్నారు.

వారం కిందట గాజువాకలో కొత్త కాపురం పెట్టారు. నిన్న సాయంత్రం ఆర్కే బీచ్‌కి వెళ్తుండగా బైక్‌ను లారీ ఢీ కొట్టింది. సాయి నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ శాలిని చనిపోయింది. శనివారం నాగేంద్ర పుట్టినరోజు వేడుకలను శాలిని ఘనంగా చేసింది. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.